షాకింగ్‌: ఏపీలో రైతు నెల ఆదాయం ఎంతో తెలుసా..?

Chakravarthi Kalyan
దేశవ్యాప్తంగా రైతు కష్టాల్లో ఉన్నాడు. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్టుంది పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ రైతు పరిస్థితి మరీ అధ్వాన్నం.. ఈ విషయాన్నే ఏకంగా ఈ దేశ పార్లమెంటే అంగీకరించింది. ఎందుకంటే.. ఏపీలో రైతుల సగటు ఆదాయం ఎంతో ఈ దేశ వ్యవసాయ మంత్రి తోమర్ పార్లమెంటులోనే చెప్పేశారు. ఏపీ కు చెందిన ఎంపీ జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖిత పూర్వకంగా  సమాధానం చెప్పారు.


ఇంతకీ ఏపీలో రైతు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా.. ఆరుగాలం శ్రమంచే రైతన్న నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా.. అక్షరాలా.. ఆరువేల రూపాయలు.. ఇంకా చెప్పాలంటే.. ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు. అంటే ఆరు వేల కంటే 21 రూపాయలు తక్కువే అన్నమాట. ఏపీలో భూకమతాల పరిమాణం తగ్గుతోందని.. అందుకే రైతు ఆదాయం తగ్గిపోతోందని  కేంద్రమంత్రి తోమర్‌ పార్లమెంటులో చెప్పారు. రైతు సగటు ఆదాయం తగ్గుదలకు చిన్న కమతాలే కారణమని తోమర్‌ వివరించారు.


ఆయన ఏపీ గురించి ఇంకా ఏం చెప్పారో తెలుసా.. ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో సాగు రంగం వాటా చాలా తక్కువగా ఉందట. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రకారం ఏపీలో రైతుల నెలవారీ సగటు ఆదాయం రూ.5,979 మాత్రమేనట. ఆంధ్రప్రదేశ్‌ సాగు రంగం పలు సవాళ్లు ఎదుర్కొంటోందన్న కేంద్రమంత్రి తోమర్..
ఏపీలో కొన్ని పంటల ఉత్పాదకత జాతీయ సగటు కంటే తక్కువని గుర్తు చేశారు. అంతే కాదు.. ఏపీలో పంటలపై ప్రకృతి వైపరీత్యం ప్రభావం పడుతోందంటున్నారు.


ప్రకృతి విపత్తుల కారణంగా 15.16 లక్షల హెక్టార్ల పంట పొలాలపై ప్రభావం ఉంటోందట. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయంపై నికర ఆదాయం 33.8 శాతంగా ఉందట. ఏపీలో వేతనాల ద్వారా వచ్చే ఆదాయం 41.5 శాతంగా ఉందట. జాతీయస్థాయికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి ఏపీలో ఉందని తోమర్‌ చెబుతున్నారు. ఇదీ ఏపీలో వ్యవసాయం దురవస్థ. ఇదీ ఏపీలో రైతు దుస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: