సొంత జిల్లాలో గొడవను స్మూత్‌ గా సెట్ చేసిన జగన్..?

Chakravarthi Kalyan
సీఎం సొంత జిల్లా కడపలో కొన్ని రోజులుగా వైసీపీలోని రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య వివాదం ఉంది. అయితే ఇది క్రమంగా ముదురుతోంది. రామసుబ్బారెడ్డి ఏడాది క్రితమే పార్టీలోకి వచ్చినా.. ఈ వర్గాల మధ్య సయోధ్య మాత్రం కుదరలేదు. దీంతో.. విషయం గమనించిన జగన్.. రెండు వర్గాలకూ రాజీ కుదిర్చారు. రామసుబ్బారెడ్డిని స్వయంగా పిలిపించుకుని మాట్లాడిన జగన్.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని భరోసా ఇచ్చారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రామసుబ్బారెడ్డికి పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని జగన్ భరోసా ఇవ్వడంతో ఆయన కూడా కాస్త కూల్ అయ్యాడు. ఏడాది క్రితమే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పార్టీలోకి వచ్చినా కరోనా కారణంగా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో రామసుబ్బారెడ్డికి సముచిత గౌరవం ఉంటుందని సీఎం హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారం అయ్యిందంటున్నారు.

అంతే కాదు.. జమ్మలమడుగు నుంచి 2014 నుంచి పని చేస్తున్న సుధీర్‌ రెడ్డికే మళ్లీ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం రానున్న ఎన్నికల్లో కూడా జమ్మలమడుగు నుంచి డాక్టర్‌ సుధీర్‌రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. రామసుబ్బారెడ్డి కూడా సొంత తమ్ముడిలా సుధీర్‌రెడ్డితో కలిసి పనిచేస్తారు. అయితే రామసుబ్బారెడ్డిని నిరాశ పరచకుండా 2023లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఓ స్థానం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు జగన్ హామీ ఇచ్చారు.


ఒకవేళ నియోజక వర్గాల పునర్విభజన అంటూ జరిగితే జమ్మల మడుగు రెండు నియోజక వర్గాలుగా మారితే రామసుబ్బారెడ్డికి కూడా ఎమ్మెల్యే గా అవకాశం ఇస్తామని జగన్ నచ్చజెప్పారు. అయితే ఎమ్మెల్సీ లేకుంటే ఎమ్మెల్యే అంటూ భరోసా ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి మెత్తబడ్డారు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి పనిచేస్తానని రామసుబ్బారెడ్డి జగన్‌కు మాట ఇచ్చినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: