వైసీపీతో ముందుగానే కుదిరిన ఒప్పందం??
తిరుపతి లోక్సబభ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.. గెలిచి తీరుతాం.. అంటూ ప్రగల్భాలు పలికిన భారతీయ జనతాపార్టీ నేతలు.. చివరికి చేతులెత్తేశారు. అధికార పార్టీ వైసీపీ అరాచకాలకు పాల్పడుతున్నట్లు మీడియాలో సాక్ష్యాలను కూడా బయటపెడుతుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా కిమ్మననడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశమే ఇప్పుడు చర్చనీయాంవమవుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు.. ఇతర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో బస్సులు.. ఆ బస్సుల్లో దొంగ ఓటర్లు క్యూ కట్టిన విషయం విదితమే.
250 బస్సులు సీజ్
దాదాపు 250 బస్సులను సీజ్ చేశామని డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. పట్టుబడని బస్సులు.. పోలీసుల కన్నుగప్పి.. తిరుపతికి చేరుకున్న బస్సుల సంఖ్య వీటికి రెండింతలు ఉంటుందంటున్నారు. ఈ క్రమంలో దొంగ ఓటర్ల హవాను అరికట్టేందుకు.. లుగుదేశం పార్టీ జోరుగా రంగంలోకి దిగి ఎక్కక్కడ ప్రశ్నించారు. ఓటరు కార్డుల్లోని పేర్లను ప్రశ్నిస్తూ.. దొంగ ఓటర్ల గుట్టును బట్టబయలు చేశారు. వాస్తవానికి ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక బాధ్యతను కేంద్ర ఎన్నికల సంఘమే చూసింది. ఈ క్రమంలో కేంద్రంలోని పెద్దలకు రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
ముఖం చూపించని బీజేపీ నేతలు
పెద్ద ఎత్తున సాగిన దొంగ ఓట్ల తతంగానికి ఫుల్ స్టాప్ పెట్టేలా రాష్ట్ర బీజేపీ నేతలెవరూ చర్యలు తీసుకోలేదు. వీరెవరూ బయటకు కూడా రాలేదు. తిరుపతి బరిలో పోటీ చేస్తున్న రత్న ప్రభ తప్ప.. ఏ ఒక్కరూ స్పందించలేదు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్రెడ్డి, జీవీఎల్ నరసింహారావు ఏమయ్యారు.? అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. తాము ఎలాగూ.. గెలిచే పరిస్థితి లేదుకనుక వైసీపీకి సహకరిస్తే మున్ముందు.. ‘మేళ్లు’ జరుగుతాయని.. ఆశించారా? లేక.. ముందుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ పార్టీతో మిలాఖత్ అయ్యారా? అనేది ఇప్పుడు అందరికీ ఎదురవుతున్న ప్రశ్నలుగా మారాయి. ఈ ప్రశ్నలన్నింటికీ తెలుగుదేశం శ్రేణులు ఔననే సమాధానం ఇస్తున్నాయి. చిన్నతేడా వచ్చినా ఫలితం తారుమారవుతుందని పార్టీలు గగ్గోలు పెడుతుంటాయి. అలాంటిది నేరుగా వేలాదిమందిని తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నాకమలనాథులు అసలు ఏమీ జరగనట్లుగా వ్యవహరించారు. వీరంతా కేంద్ర పెద్దలకు ఏం సమాధానం చెబుతారో? ప్రజలకు ఏం సమాధానం చెబుతారో? వేచిచూద్దాం.!!