ఆ ఇద్దరిలో ఎవరు? టీపీసీసీ చీఫ్ స్థానానికి పోటీలో ఇద్దరు!
టీపీసీసీ చీఫ్ స్థానానికి కేంద్ర పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి, జీవన్రెడ్డి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరైతే బాగుంటారన్న అంశంపై అభిప్రాయాలను ఇప్పటికే సేకరించిన అధిష్టానం ఈనెలాఖరు వరకు ఒకరి పేరును ప్రకటించేందుకు సిద్ధమైంది. గత రెండు నెలల క్రితం రేవంత్రెడ్డిని పార్టీ కొత్తసారధిగా ఎంపిక చేశారంటూ ప్రసార మాధ్యమాల్లో విసృత ప్రచారం సాగింది. ఈ క్రమంలో పార్టీలోని రేవంత్ వ్యతిరేఖ వర్గీయులు, పలువురు సీనియర్ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి రేవంత్ పేరు ప్రకటించకుండా అడ్డుపడ్డారన్న చర్చ కాంగ్రెస్లో విస్తృతంగా సాగింది. ఈ క్రమంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా జీవన్రెడ్డి పేరును అధిష్టానం తెరపైకి తెచ్చింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు రావటం, ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో టీపీసీసీ చీఫ్ ఎంపిక నిలిచిపోయింది.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా వీరిద్దరిలో ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందనే అంశంపై కేంద్ర పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కొత్తపార్టీ పెడుతున్న క్రమంలో.. కాంగ్రెస్లోని నేతలను ఆ పార్టీలోకి చేర్చుకొనేందుకు షర్మిల దూతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల పార్టీలోకి కాంగ్రెస్ క్యాడర్ వెళ్లకుండా చూడటం పెద్దసవాల్గా మారింది. మరోవైపు అధికార తెరాసపై దూకుడుగా ముందుకెళ్లడంతో పాటు.. దూసుకొస్తున్న బీజేపీని ఎదుర్కొని పార్టీని బలోపేతం చేసే సత్తాఉన్న నేతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే కాంగ్రెస్ పూర్వవైభవం వస్తుంది. వీటన్నింటిని బేరీజు వేస్తున్న పార్టీ పెద్దలు రేవంత్రెడ్డివైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. రేవంత్కాని పక్షంలో జీవన్రెడ్డి పేరుఫైనల్ చేస్తారన్న ప్రచారం సాగుతుంది.