కొవిడ్ను నియంత్రించామనుకుంది.. అంతే!!
రెండోదశలో దేశవ్యాప్తంగా కరోనా ఉధృతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. మొదటిదశలో అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించి కరోనా గొలుసును తెగ్గొట్టిన భారత్ రెండోదశలో చేతులెత్తేసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పశ్చిమబెంగాల్లో సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్, కుంభమేళా లాంటివన్నీ కలిసి దేశాన్ని కరోనాభారతంగా మార్చేశాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం పెదవి మాత్రం విప్పడంలేదు. కరోనా కట్టడిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసి చేతులు దులుపుకుంటున్నతీరుపై ఇంటా బయటా విమర్శలు వ్యక్తమవుతున్నా తనను కాదన్నరీతిలో కేంద్ర వ్యవహారశైలి ఉంటోంది.
భారత్ తనను తాను ఎక్కువగా ఊహించుకుందా?
భారతదేశాన్ని కరోనా మహమ్మారి ఎంతలా వణికిస్తుందో చూస్తూనే ఉన్నాం. అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ దీనిపై స్పందించారు. భారత్లో కరోనా ఎందుకు ఉధృతంగా ఉంది అనే విషయమై యూఎస్ సెనేట్లో జరిగిన చర్చలో ఆయన సెనేటర్లకు పూర్తి వివరాలు తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కుంభమేళాకన్నా ముందే భారత్లో కరోనా వ్యాపించేసిందని, అయితే తాము కరోనాను నియంత్రించామని భావించి అర్ధంతరంగా లాక్డౌన్ ముగించేయడమే మన కళ్లముందు కనపడుతున్న కరోనా భారతమని సెనేటర్లకు చెప్పారు. యూఎస్ సెనేట్ హెల్త్, ఎడ్యుకేషన్, లేబర్ అండ్ పెన్షన్స్ కమిటీకి ఆయన భారత్లో కరోనా పరిస్థితిని డాక్టర్ ఫౌచీ వివరించారు. నియంత్రించేశామని అనుకోవడం కూడా ఒక కారణమని ఆయన విశ్లేషించారు.
ఇండియన్ వేరియంట్పై అభ్యంతరం?
కరోనా సెకండ్ వేవ్ భారత్లో భయంకరంగా విజృంభించడానికి కారణమైన బి.1.617 వైరస్ వేరియంట్ తొలిసారి ఇక్కడే వెలుగు చూసింద. అందుకే దీన్ని చాలా దేశాలు 'ఇండియన్ వేరియంట్' అని పిలుస్తున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థకు భారతదేశం తన అభ్యంతరాన్ని తెలియజేసింది. వైరస్లు, వాటి వేరియంట్లను అవి ఏ దేశంలో తొలిగా కనిపిస్తే ఆ దేశం పేరుతో తాము ఎన్నడూ సంభోదించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చింది. వాటిని ఆ శాస్త్రీయ నామాలతోనే పిలవాలని అన్ని దేశాలకు సూచన చేసింది. డబ్ల్యూహెచ్వో అలాగే పిలుస్తుందని, అన్ని దేశాలు అలాగే పిలవాలని కోరింది.