ఏపీలో రికార్డులకెక్కని కరోనా కేసులెన్నో తెలుసా..?

Deekshitha Reddy
ఇటీవల తెలంగాణలో ఇంటింటి సర్వే చేపడితే వారం రోజుల్లోనే లక్షన్నరమందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. వారందరికీ హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇచ్చి, కొంతమందిని ఆస్పత్రిలో చేర్పించారు వైద్య సిబ్బంది. వారం రోజుల్లో అధికారికంగా పరీక్షల ద్వారా కరోనా నిర్థారించిన వారి సంఖ్య పాతిక వేల లోపే ఉంది. అంటే ఇంటింటి సర్వే ద్వారా పరీక్షలకు చేయించుకోకుండా ఉన్న కరోనా రోగుల సంఖ్య అలా బయటపడింది. అదే సర్వే ఏపీలో కూడా జరిగింది. ఏపీలో ఐదో విడత జరిగిన ఇంటింటి సర్వేలో 1.16 లక్షలమందిలో కరోనా అనుమానిత లక్షణాలున్నట్టు గుర్తించారు వైద్య సిబ్బంది.

ఏపీలో ప్రతి  రోజూ సుమారుగా 20వేల కరోనా కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. వారానికి లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో ఇంటింటి సర్వేద్వారా బయటపడిన అనుమానితుల సంఖ్య 1.16 లక్షలుగా ఉంది. ఐదో విడత సర్వేలో ఏపీలోని వైద్య సిబ్బంది 1,52,55,182 కుటుంబాలను కలసి వివరాలు సేకరించారు. వైరస్ లక్షణాలున్నట్టు గుర్తించిన 26,165మందినుంచి నమూనాలు సేకరించగా వీరిలో 2,490మందికి వైరస్ నిర్థారణ అయింది. మరికొంతమంది నమూనాలు సేకరించాల్సి ఉంది.

ఇంటింటి సర్వేతో కరోనా వాస్తవాలు కళ్లకు కడుతున్నాయి. చాలామంది ఇళ్లలోనే ఉంటూ లక్షణాలున్నా ఆస్పత్రులకు వెళ్లకుండా తమకు తామే సొంతగా వైద్యం చేసుకుంటున్నారు. అదే సమయంలో సామాజిక దూరం మాత్రం పాటించడంలేదు. దీంతో సహజంగానే కుటుంబ సభ్యులకు వైరస్ సోకుతోంది. కర్ఫ్యూ సడలించిన సమయంలో నిత్యావసరాలకోసం జన సమూహాలలోకి వెళ్లడంతో పక్క వారికి కూడా వైరస్ అంటుకుంటుంది. తెలిసీ, తెలియక.. ఇలా చాలామంది సూపర్ స్ప్రైడర్లుగా ఉంటున్నారు. ఇలాంటి వారందర్నీ ఇంటింటి సర్వేలో గుర్తించి, వారిని ఇల్లు కదలకుండా, హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు వైద్య సిబ్బంది. అలా చేస్తేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెబుతున్నారు. ఇక ఏపీలో ఆరో విడత ఇంటింటి సర్వే నేటినుంచి ప్రారంభం అవుతుంది. మొత్తమ్మీద ఇంటింటి సర్వే ద్వారా కరోనా కేసులపై మరిన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి, ముందస్తు నివారణ చర్యలకు మార్గాలు సుగమం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: