ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పాక్షిక లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజలు బయట తిరిగేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కర్ఫ్యూ సమయంలో బయటతిరిగితే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. ఐతే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు ఈ నిబంధనల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అలాంటి వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. నిజానికి ఈ నెల 5 తేదీ నుంచి 18 వరకు విధించిన కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ నెలాఖరు వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో మెరుగైన ఫలితాలు కనిపించాలంటే కనీసం నాలుగు వారాల పాటు కర్ఫ్యూ అమల్లో ఉండాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయం, నిబంధనలను గతంలో మాదిరిగానే యథాతథంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దాటి వెళ్లే వారు, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ – పాస్ను ఏపీ ప్రభుత్వంవారు అందజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు తాజాగా ట్విట్టర్ వేదికగా మరోసారి ఈ పాస్పై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ట్వీట్ చేసిన పోలీసులు.. మెడికల్ ఎమర్జన్సీలో భాగంగా ఈ-పాస్ అప్లై చేసుకోవాలనుకునే వారు ఆంధ్రప్రదేశ్ ట్విట్టర్ హ్యాండిల్తో పాటు ఏపీ పోలీస్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. https://t.co/cCIiWN47Io?amp=1 /https://t.co/ipgoa35o3x?amp=1 లింకుపై క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈపాస్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో వివరాలను నమోదు చేసి పాస్ ను పొందొచ్చు. అయితే శుభకార్యాలు, అంతక్రియలకు సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత స్థానిక అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రలతో అనుమతి పొందాలని ఏపీ సర్కార్ సూచించింది.