ప్రశ్నలతో జేపీ నడ్డాను ఉక్కిరిబిక్కిరి చేసిన ఈటల..?

Chakravarthi Kalyan
బీజేపీలో చేరాలను దాదాపుగా నిర్ణయించుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్న రాత్రి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాను కలిశారు. పార్టీలో చేరే అంశంపై చర్చంచారు. అయితే పార్టీలో చేరిక గురించి ఉన్న అనేక సందేహాలను నేరుగా నడ్డా ముందు ఉంచారు. దాదాపు 50 నిమిషాల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఎలాగైనా కేసీఆర్‌ ముందు ఆత్మగౌరవ పోరాటం చేసి నిలబడాలని పట్టుదలగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సందర్భంగా జేపీ నడ్డాను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్టు తెలుస్తోంది.

మీ పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యం ఇస్తారా.. మీ పార్టీలో చేరాక మళ్లీ మీరు టీఆర్ఎస్‌తో చేతులు కలుపుతారా.. అలా చేస్తే మీ పార్టీని నమ్మకుని వచ్చిన మాలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి.. కేసీఆర్ సర్కారుపై గట్టిగా పోరాడే ఉద్దేశం ఉందా లేదా.. తెలంగాణలో టీఆర్ఎస్‌ ను మట్టి కరిపించేందుకు మీ ప్లాన్ ఏంటి..? ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనుకుంటున్నారు జనం.. మీకు ఈ సంగతి తెలుసా.. భవిష్యత్తులో టీఆర్ఎస్, బీజేపీ చేతులు కలపరన్న గ్యారంటీ ఏంటి..? అదే జరిగితే బీజేపీని నమ్మి వచ్చే మాలాంటి వారి పరిస్థితి ఏమిటి? అంటూ ఈటల ప్రశ్నల వర్షం కురిపించారట.

అంతే కాదు.. మొహమాటం లేకుండా జేపీ నడ్డా ముందు అనేక విషయాలు చర్చించారట. కేసీఆర్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడుతుందన్న ఆరోపణలున్నా.. ఇప్పటి వరకూ ఎందుకు ఒక్క విచారణ కూడా చేయలేదు.. మిమ్మల్ని ఎలా నమ్మి రావాలి అంటూ గట్టిగానే ప్రశ్నించారట ఈటల. అయితే ఈటల ప్రశ్నలన్నీ  ఓపికగా విన్న జేపీ నడ్డా.. అన్నింటికీ బదులిచ్చారట. పశ్చిమబెంగాల్‌లో మూడు స్థానాల నుంచి అధికారం చేపడతామనే వరకు ఎదిగామని గుర్తు చేశారట.

మా తదుపరి టార్గెట్‌ తెలంగాణయే.. తెలంగాణలో బెంగాల్‌ ను మించి దూకుడు ప్రదర్శిస్తామన్నారట. అంతే కాదు.. కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలపై తగిన సమయంలో స్పందిస్తామన్నారట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పాటు చేయడం ఖాయమని దీమాగా చెప్పారట జేపీ నడ్డా. ఏదేమైనా ఈటల మాత్రం తనకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేసుకున్నారన్నమాట. మరి ఇక బీజేపీలో చేరినట్టేనా.. ఇంకా సందేహం ఉందా.. ఈటలే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: