గుడ్ న్యూస్.. ఆ విషయంలో అమెరికాను దాటేసిన భారత్?
ప్రపంచంలోనే యాంటీ కోవిడ్ -19 వ్యాక్సిన్ తొలి డోసు అందుకున్నవారి సంఖ్య మన దేశంలో ఎక్కువగా ఉందని కేంద్రం వివరించింది. ఈ సంఖ్య ఏకంగా అమెరికాను అధిగమించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే స్పీడుతో రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేసి అందరికీ వ్యాక్సిన్ వేస్తామని కేంద్ర స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకె పాల్ విలేకరులతో మాట్లాడుతూ దేశంలో 60 ఏళ్లు పైబడిన జనాభాలో 43 శాతం, 45 ఏళ్లు దాటిన వారికి 37 శాతం మంది జనాభాకు వ్యాక్సిన్ వేశామని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 17. 2 కోట్లకు చేరిందన్నారు వీకే పాల్. యుఎస్లో ఈ సంఖ్య 16. 9 కోట్లుగా ఉందని దాన్ని బట్టి మనమే ముందున్నామని వెల్లడించారు. కొవిడ్ వ్యాక్సిన్ ఒక డోసు పొందిన జనాభా పరంగా చూస్తే భారత్ అమెరికాను అధిగమించిందని, ఇది చాలా మంచి పరిణామమని వెల్లడించారు ఆయన.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్యను చూస్తే కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నదని పాల్ తెలిపారు. దేశంలో 10 లక్షల జనాభాకు 20,519 కోవిడ్ కేసులు ప్రస్తుతం నమోదవుతున్నాయని వెల్లడించారు. అంటే సగటు ఇప్పటికీ 22,181 కన్నా ఎక్కువగా కేసులు ఉన్నాయని వీకే పాల్ స్పష్టం చేశారు. మే 7 న అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయని అప్పటి నుంచి క్రమంగా కాస్త తగ్గుతున్నట్టు తెలిపారు.