తిరుమలలో భక్తుల సందడి.. పెరుగుతున్న హుండీ రాబడి..

Deekshitha Reddy
సెకండ్ వేవ్ భయాలు క్రమక్రమంగా తగ్గిపోతున్న వేళ, లాక్ డౌన్ నిబంధనలు ఒక్కొక్కటే తొలగిపోతున్న వేళ.. తిరుమల మళ్లీ కళకళలాడుతోంది. తిరుమల గిరులకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. హుండీ ఆదాయం కూడా కరోనా టైమ్ కంటే సగటున పదిరెట్లు పెరిగింది.
ప్రస్తుతానికి తిరుమలలో రూ.300 ప్రత్యేక దర్శనాలు మాత్రమే కొనసాగుతున్నాయి. అటు అలిపిరి వద్ద కాలినడక మార్గాన్ని కూడా మూసివేయడంతో.. నడకదారిన వచ్చే భక్తులకు శ్రీవారి మెట్టు మాత్రమే ప్రత్యామ్నాయం అయింది. అయినా కూడా భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. గతంలో 4 వేలు, 5వేలకు కూడా భక్తుల దర్శనాలు పరిమితం అయ్యాయి. ఆ సంఖ్య ఇప్పుడు 10వేలు దాటుతోంది. ఈనెల 12వతేదీన గరిష్టంగా 16,568మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 13, 14 తేదీల్లో వరుసగా 15,314మంది, 13,918మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
పెరుగుతున్న హుండీ ఆదాయం..
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఇటీవల కాలంలో ఎప్పుడూ లక్షల్లోకి పడిపోలేదు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో పూర్తిగా భక్తుల దర్శనాలు నిలిపివేయడంతో హుండీ ఆదాయం లెక్కించలేకపోయారు. అయితే సెకండ్ వేవ్ లో మాత్రం పరిమితంగానే భక్తులను దర్శనాలకు అనుమతించారు. రవాణా సౌకర్యాలు లేక, కరోనా భయంతో చాలామంది స్వచ్ఛందంగానే కొండకు రావడం ఆపేశారు. దీంతో హుండీ ఆదాయం ఎన్నడూ లేనంతగా పడిపోయింది. మే 13వతేదీన కనిష్టంగా 10లక్షల రూపాయలు మాత్రమే హుండీ ఆదాయం వచ్చింది. ఇప్పుడు భక్తుల రాక పెరగడంతో హుండీ ఆదాయం కూడా కోటి రూపాయలు దాటింది. సరిగ్గా నెలరోజుల తర్వాత జూన్ 13వతేదీన హుండీ ఆదాయం 2.06 కోట్ల రూపాయలకు చేరింది.
కరోనా భయాలు తగ్గిపోవడంతోపాటు, రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపడటంతో తిరుమలకు భక్తుల రాక పెరిగింది. రద్దీ తక్కువగా ఉన్న నేపథ్యంలో సులభంగా దర్శనం అవుతుందనుకుంటున్న భక్తులంతా తిరుమలకు పోటెత్తుతున్నారు. నెలాఖరుకల్లా తిరుమలకు మళ్లీ గత వైభవం వస్తుందని, భక్తులతో కిటకిటలాడుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనల మేరకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: