'కాపు' కాస్తున్న మంత్రులకు ఇబ్బంది లేదా!

M N Amaleswara rao

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సమయం దగ్గర పడుతుంది. సీఎం జగన్ మొదట్లో చెప్పిన విధంగా మరో ఆరు నెలల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది.  ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు దాటింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరిన గానీ, వచ్చే ఏడాది మొదట్లోగానీ మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇక అప్పుడు మంత్రులుగా అవకాశం దక్కించుకోవాలని చాలామంది ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఇదే సమయంలో తమ పదవులని కాపాడుకోవాలని ప్రస్తుతం ఉన్న మంత్రులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరు ఐదేళ్లు వరకు కంటిన్యూ అవుతారని తెలుస్తోంది. అయితే జగన్ మంత్రివర్గంలో ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు ఐదేళ్లు కొనసాగుతారా? లేదా? అనే అంశం ఆసక్తికరంగా మారింది.


ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో నలుగురు కాపు వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన పేర్ని నాని, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ళ నాని, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కన్నబాబు, విశాఖపట్నంకు చెందిన అవంతి శ్రీనివాస్‌లు జగన్ కేబినెట్‌లో ఉన్నారు.


అయితే ఈ నలుగురు జగన్ కేబినెట్‌లో ఐదేళ్లు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రులు పేర్ని నాని, కన్నబాబుల పదవులకు ఎలాంటి ఢోకా లేదని ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు రెండేళ్లలో మంచి పనితీరు కనబర్చారు. అలాగే ప్రతిపక్షాలకు చెక్ పెట్టడంలో కూడా ఈ ఇద్దరు ముందున్నారు.


అటు ఆళ్ళ నాని కూడా బాగానే పనిచేస్తున్నారు. కాకపోతే కరోనా లాంటి విపత్తు వల్ల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆళ్ళ నానికి కాస్త ఇబ్బంది వచ్చింది. అయితే సీఎం జగన్ కరోనాని ధీటుగా ఎదురుకోవడం వల్ల ఆళ్ళ నాని మీద ఎక్కువ ఒత్తిడి పడలేదు. కాకపోతే మంత్రిగా నాని ఇంకా మెరుగైన పనితీరు కనబర్చాలసిన అవసరముందని తెలుస్తోంది. ఇక అవంతి సైతం మంత్రిగా సత్తా చాటాల్సిన అవసరముంది. ఏదేమైనా ప్రభుత్వానికి కాపు కాసే మంత్రులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. వాళ్లే ఐదేళ్లు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: