ఈటెలపైకి కేసీఆర్ "ఇనగాల కౌశికాస్త్రం"?
హుజూరాబాద్ ఉప ఎన్నిక మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు కత్తిమీ సాములా మారింది. సొంత పార్టీ పెడతారనే కేసీఆర్ అంచనాలకు భిన్నంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈటెల భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ తో చేసిన సహవాసంవల్ల ఆయన ఆలోచనలు ఎలావుంటాయో అంచనా వేసుకున్న ఈటెల అందుకనుగుణంగా పావులు కదిపి ఆయనకు షాకిచ్చారు. దీంతో కేసీఆర్ తన అమ్ములపొది నుంచి రెండు అస్త్రాలను బయటకు తీశారు. వారే ఇనగాల పెద్దిరెడ్డి, కౌశిక్. తాజాగా వీరిద్దరూ ఈటెలపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఇలాఒకరిపై మరొకరు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఉప ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, మాజీమంత్రి వ్యవహరిస్తున్నారు.
టీఆర్ ఎస్కన్నా ఈటెలపైనే దృష్టి
స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడంకన్నా కమలం గుర్తుపై పోటీచేయాలని ఈటెల నిర్ణయించుకున్నప్పటినుంచి ఆయనపై విమ్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్తులు కాపాడుకోవడానికే బీజీపీ చెంతకు చేరారని టీఆర్ ఎస్ నేతలు విమర్శించారు. తాజాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున హుజూరాబాద్ నుంచి పోటీచేసి ఓటమి పాలైన కౌశిక్ రంగంలోకి దిగారు. ఈటెల టీఆర్ఎస్ నుంచి బయటకు రావడంతో ఆయన్ను లక్ష్యంగా ఎంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకన్నా ఎక్కువగా ఈటెల రాజేందర్పై దృష్టి సారించడంతో కౌశిక్ గులాబీబాస్ కనుసన్నల్లో నడుస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా కౌశిక్ తన దూకుడును మరింత పెంచారు.
కౌశిక్కు తోడుగా పెద్దిరెడ్డి?
కౌశిక్కు తోడుగా మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డి కూడా ఈ జాబితాలో చేరారు. హుజూరాబాద్ నుంచి 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన పెద్దిరెడ్డి బీజేపీలో చేరారు. ఈటెలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రాజేందర్ చేరికపై బీజేపీ పెద్దలు పెద్దిరెడ్డికి సర్దచెప్పడంతో ఆయన కాస్తంత నెమ్మదించారు. అధిష్టానం ఆదేశిస్తే హుజూరాబాద్లో పోటీచేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఆయన కూడా గులాబీబాస్కు అనుకూలంగా వ్యవహరించడంలో భాగమే ఈ విమర్శలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాజేందర్ను ఓడిస్తే ఆయన రాజకీయ జీవితానికి తెరపడినట్లవుతుందని టీఆర్ ఎస్ నేతలు భావిస్తున్నారు. గెలుపొందితే బీజేపీ నేతలు మరో బెంగాల్ తరహా వాతావరణాన్ని సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ యోచనగా ఉంది. ఆరంభంలోనే దీనికి చెక్ పెట్టేలా ముఖ్యమంత్రి దృఢనిశ్చయంతో ఉన్నారని తెలంగాణ రాష్ట్రసమితి వర్గాలంటున్నాయి.