దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కేసులు కూడా ఇదివరకు కంటే తక్కువగానే నమోదవుతున్నాయి. అంతే కాకుండా కరోనా మరణాలు కూడా చాలా వరకూ తగ్గాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ లో భారీ సడలింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూ విధించే ఆలోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ భల్లా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేస్తూ లేఖ రాశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా ఆంక్షలు విధించడం లేదా సడలింపులు చేయడం జరగాలి లేఖలో పేర్కొన్నారు. ఆంక్షల మినహాయింపుల అనంతరం కూడా కరోనా నియంత్రణకు 5 సూత్రాలను అమలు చేయాలని ఆదేశించారు.
ఆ ఐదు అంశాంలు....(టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, నిరంతర నిఘా) నియమాలను పాటించాలని సూచించారు. అంతే కాకుండా కరోనా పరీక్షల సంఖ్యను తగ్గించకుండా కొనసాగించాలన్నారు. కేసుల సంఖ్య పెరిగినా, పాజిటివిటీ రేటు అధికంగా నమోదైనా ఆ ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. వ్యాక్సినేషన్ అనేది కరోనా చైన్ సిస్టంను విచ్ఛిన్నం చేయడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అజయ్ బల్లా పేర్కొన్నారు.
పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు జాగ్రత్తగా పునఃప్రారంభించాలని సూచించారు. ఇందుకోసం జిల్లా, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కరోనా లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి భాద్యతలు రాష్ట్రాలకు ఇచ్చిన సంగతి తెలిసిందే. స్థానికపరిస్థితులు రాష్ట్రాలకే బాగా తెలిసి ఉంటాయని అందువల్లే రాష్ట్రాలకే అధికారాలకు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ తో వచ్చిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు తగిన జాగ్రత్తలు సూచిస్తూ లేఖ రాసింది.