కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్‌ ఆగ్రహం.. ఏం చేసిందంటే..?

Chakravarthi Kalyan
పీసీసీ ఛీఫ్ నియామకం కాంగ్రెస్‌లో చిచ్చు రేపింది. పీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.  ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ పదవికి కూడా అమ్మకాలు జరిగాయన్నారు. పీసీసీ చీఫ్ పదవిని మాణిక్యం ఠాగూర్ అమ్ముకున్నారని విమర్శించరు. కాంగ్రెస్‌ పార్టీ కూడా టీ టీడీపీ మాదిరిగానే మారబోతోందని కామెంట్ చేశారు. టీపీసీసీలో కార్యకర్తలకు గుర్తింపు లేదన్న వెంకటరెడ్డి.. తాను ఇబ్రహింపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. 2023 వరకూ గాంధీభవన్ మెట్లు ఎక్కబోనన్నారు వెంకటరెడ్డి.


అయితే కోమటి రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. టీపీసీసీ అధ్యక్షులుగా ఎంపీ రేవంత్ రెడ్డిని ఏఐసీసీ నియమించిందని.. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేఖించడం సరికాదని అన్నారు.
అధిష్టానం ప్రజాస్వామ్య బద్దంగా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుందని.. రోజుల తరబడి అందరితో చర్చించిన తరువాతనే నిర్ణయం తీసుకుందని అన్నారు. టీపీసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్‌ను నిందించడం పార్టీ క్రమశిక్షణా రాహిత్యమని మల్లు రవి అన్నారు.


పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పీసీసీ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఖండించారు. ఎంపీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌ మీదనే కాదు కాంగ్రెస్‌ పార్టీపై చేసినట్లుగా పరిగణిస్తున్నామన్నారు. పీసీసీ అధ్యక్షుడి నియామకం సోనియా, రాహుల్‌ గాంధీల ఆదేశాల మేరకు జరిగిందని.. దీనిని వ్యతిరేఖిస్తున్నారంటే...సోనియా, రాహుల్‌ గాంధీల నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లే నన్నారు.


మొత్తం మీద కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానానికి కొందరు కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. అంతే కాదు.. కోమటిరెడ్డి మాట్లాడిన వీడియోతోపాటు ఆయన వ్యాఖ్యలను ఆంగ్లంలోకి ట్రాన్స్‌లేషన్ చేసి అధిష్టానానికి పంపారు. దీంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం  చేసింది. రాష్ట్ర ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజులు.. రాష్ట్ర నేతలకు ఫోన్ చేసి వాకబ్‌ చేశారు. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేఖంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని ఠాగూర్ హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: