ప్రపంచ దేశాలలో వ్యాప్తి చెందిన
కరోనా పురుగు మానవాళి జీవన శైలినే మార్చేసింది. ఓ వైపు లక్షల్లో
జనాభా కరోనా కాటుకు బలయ్యారు. ఎంతో మంది తమ కుటుంబీకులను, బంధుమిత్రులను కోల్పోయి జీవచ్చవంలా బతుకుతున్నారు. ఇంకో వైపు ఎంతోమంది ఉద్యోగస్తులు తమ ఉపాధిని పోగొట్టుకొని రోడ్డున పడ్డారు. తమ కుటుంబాలను పోషించలేక కృంగిపోతున్నారు. చిన్నాచితకా వ్యాపారాల నుండి భారీ పరిశ్రమల వరకు అన్నీ ఎంతగానో నష్టపోయాయి. తద్వారా యాజమాన్యాలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొంతమందికి
కరోనా వచ్చిందా అన్న భయం, మరికొందరికి వస్తుందేమోనన్న ఆందోళన కాలు బయటకు పెడితే
కరోనా వస్తుందేమోనని బిక్కుబిక్కుమంటున్న జనాలు. చిన్నారులకు వస్తే ఎలా కాపాడుకోవాలో అని కంగారుతో మానసికంగా తల్లిదండ్రులు సతమతమవుతున్నారు.
ఇంకో వైపు కొత్త వేరియంట్లపై వస్తున్న వార్తలతో వణికి పోతున్న మరికొందరు జనాలు. ఇలా ఎటు చూసినా ప్రపంచమంతా
కరోనా కారణంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతుంది.
కరోనా రాని ఇల్లు ఉందేమో కానీ మానసికంగా మదన పడని మనిషే లేడు. అంతగా ఈ కోవిడ్ వైరస్ ప్రజల్ని మానసికంగా బాధిస్తోంది. ఇప్పటికే చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడితో వైద్యులను సంప్రదిస్తునట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. దేశమంతటా ఈ మానసిక కేసులు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రదానంగా దేశ
రాజధాని ఢిల్లీలో మానసిక సమస్య కేసులు భారీగా నమోదైనట్లు సమాచారం. రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అంటున్నారు.
దీనివల్ల మరో కొత్త సమస్య వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలందరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందిగా వారు సూచన చేస్తున్నారు. మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఇతర కార్యక్రమాలతో బిజీగా మారడం వంటి వాటి ద్వారా తమ ఆలోచనలను అదుపు చేసుకోవాలని ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు అంటున్నారు.