కేంద్ర దగ్గర పట్టు జగన్దా... కేసీఆర్దా..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోడీ దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎవరికి పట్టుంది? ఎవరి మాటను కేంద్రం విశ్వసిస్తోంది? ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తోంది? అనే చర్చ జోరుగా సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మద్య ఇటీవల జలవివాదాలు తెరమీదికి వచ్చాయి. కృష్ణా నదీ జలాలను.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏవిధంగా జల విద్యుత్ ఉత్పత్తికి దూకుడుగా వ్యవహరించిందీ.. అందరికీ తెలిసిందే. అయితే.. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ ఫుల్లు సైలెంట్ అయ్యారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి కేసీఆర్ సర్కారు నీటిని తోడేసి.. వాడేసినా ఆయన మాట్లాడలేదు.
అయితే.. కేంద్రానికి మాత్రం లేఖలు సంధించారు జగన్. ప్రధాని నరేంద్ర మోడీ సహా, జలశక్తి శాఖలకు జగన్ లేఖలు రాశారు. వీటి పర్యవసానంపై అప్పట్లో పెద్దగా చర్చ సాగలేదు. కానీ, తాజాగా కేంద్ర ప్రభుత్వం.. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. రెండు నదులపై ఉన్న దాదాపు 100కు పైగా ప్రాజెక్టులను తన పరిధిలోకి, అజమాయిషీలోకి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఇప్పటి వరకు దూకుడుగా వ్యవహరించిన కేసీఆర్ కాళ్లకు బంధం పడనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక, ఇదే సమయంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంపై సీఎం జగన్ సహా.. వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత సమావేశంలో.. జగన్.. ఇదే విషయాన్ని ప్రస్తావించి.. మీడియా ముందు ప్రతి ఒక్కరూ కేంద్రాన్ని పొగడాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు.. కేంద్రం దగ్గర ఈ ఇద్దరు సీఎంలలో ఎవరికి పట్టుంది ? అనే చర్చ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. ఇప్పటి వరకు కేంద్రాన్ని సైతం తన చెప్పుచేతల్లో పెట్టుకున్నానని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని.. భావించే కేసీఆర్కు ఇప్పుడు కేంద్రం జారీ చేసిన కృష్ణా, గోదావరి నదుల గెజిట్ నోటిఫికేషన్ పెద్ద చిక్కే తెచ్చిందని అంటున్నారు పరిశీలకులు. సో.. మొత్తానికి జగన్దే కేంద్రం దగ్గర పైచేయిగా ఉందని కొందరు అంటున్నారు.
అయితే ఇక్కడే మరో ట్విస్టు కూడా ఉంది. ఏపీపై బీజేపీకి పెద్దగా ఆశల్లేవు.. పైగా తాము ఎలా చెపితే అలా నడుస్తున్నాడన్న నమ్మకాలు కేంద్ర పెద్దలకు ఉన్నాయి. అదే కేసీఆర్ను బీజేపీ ఎప్పుడూ నమ్మి ఉండదు... పైగా తెలంగాణలో అధికారం కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో తమకు అంత సీన్ లేదని బీజేపీకి తెలుసు.. అందుకే వీరిద్దరి మధ్య ఎప్పుడు ఏ వార్ వచ్చినా జగన్కే కాస్త ఫేవర్గా ఉంటుందన్న అభిప్రాయాలు సర్వత్రా ఉన్నాయి.