మళ్లీ సత్తా చాటిన చైనా.. గంటకు. 600 కి.మీ వేగం..?
టెక్నాలజీ విషయంలో చైనా దూసుకుపోతోంది. ప్రత్యేకించి బుల్లెట్ రైళ్ల విషయంలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నెలకొల్పుతూ సత్తా చాటుతోంది. తాజాగా గంటకు 600 కి.మీ.ల వేగంతో పరుగులు తీసే అత్యాధునిక మాగ్లెవ్ రైలును చైనా రూపొందించింది. తూర్పు చైనా ప్రాంతంలోని షిడాంగ్ ప్రావిన్స్ కిండావ్ సిటీలో ఈ కొత్త మాగ్లెవ్ ట్రైన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఇదేనని చైనా సగర్వంగా ప్రకటించింది.
ఈ ట్రైన్ టెక్నాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సాధారణ రైళ్ల మాదిరిగిగా ఈ రైళ్ల చక్రాలు పట్టాలను తాకవు. చక్రాలు పట్టాలను తాకకుండానే అయస్కాంత-వాయుస్తంభన ప్రోటోటైప్ టెక్నాలజీతో ఈ రైలు పరుగులు తీస్తుంది. చైనా ఈ ప్రాజెక్టును దాదాపు ఐదేళ్ల క్రితం ప్రారంభించింది. అక్టోబర్ 2016లో ప్రారంభించిన మాగ్లెవ్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు సరికొత్త రికార్డులకు వేదిక అవుతోంది. ఈ టెక్నాలజీతో అత్యంత వేగవంతమైన రైలును రూపొందించాలన్నది చైనా కల. అయస్కాంత-వాయుస్తంభన ప్రోటోటైప్ రైలును గంటకు 600 కి.మీ. వేగాన్ని సాధించాలని అప్పుడే లక్ష్యం పెట్టుకున్నారు.
2019 నుంచి ఈ ప్రాజెక్టు ఊపందుకుంది. అనేక సార్లు విజయవంతంగా ప్రయోగాలు జరిపిన తర్వాత ఇప్పుడు ఈ రైలును ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 2020 జూన్లో ట్రయల్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది చైనా. మొత్తం పది బోగీలతో నడిచే ఈ రైలులో ఒక్కో బోగీలో వంద మంది వరకూ ప్రయాణిస్తారని చైనా చెబుతోంది.
సంప్రదాయ రైళ్ల తరహాలో మాగ్లెవ్ రైళ్లు ప్రయాణ సమయంలో పట్టాలను తాకవు కాబట్టి శబ్దం అనేది చాలా తక్కువగా వస్తుంది. శర వేగంగా ప్రయాణిస్తాయి. అతి తక్కువ శబ్దాన్ని వెలువరిస్తాయి. ఇవి పర్యావరణహితమైన రైళ్లని ఈ రైళ్లను రూపొందించిన ఝుఝౌ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధి హీ యున్ఫెంగ్ చెబుతున్నారు. మరి ఇలాంటి రైళ్లు మన ఇండియాకు ఎప్పడు వస్తాయో కదా.