ప్రగతి భవన్‌లో కేసీఆర్ దళిత బంధు !

Chakravarthi Kalyan
దళిత బంధు.. కేసీఆర్ తాజా ప్రజాకర్షక పథకమిది. కానీ.. ఇప్పటి వరకూ దేశంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వనంత భారీ ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. ఏకంగా ఒక్కో దళిత కుటుంబానికి  10 లక్షల రూపాయలు సాయం అందించడం ఈ దళిత బంధు పథకం లక్ష్యం.. అందులోనూ ఈ పది లక్షల రూపాయలు పూర్తిగా ఉచితంగా అందిస్తారట. రుణంగా కానీ.. రికవరీ గానీ ఏమీ ఉండవు.. అంతే కాదు..ఏకంగా అకౌంట్లలోకి నేరుగా పది లక్షల రూపాయలు వేస్తారు.


హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ఈ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు. ముందుగా  హూజూరాబాద్ నియోజక వర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలన్నది కేసీఆర్ వ్యూహం. ఆ తర్వాత రాష్ట్రమంతటా అమలు చేస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలోని మిగిలిన చోట్ల నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ఈ పథకం అమలు చేస్తారట. హుజూరాబాద్‌లో మాత్రం అన్ని దళిత కుటుంబాలకు ఇస్తామని చెబుతున్నారు.


ఇప్పుడు ఈ దళితబంధు పథకంపై కేసీఆర్ స్వయంగా ఓ అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఏకంగా ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు నిర్వహించబోతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి దళిత బంధు అవగాహన సదస్సు జరగనుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ఈ అవగాహన సదస్సుకు నలుగురిని ఆహ్వానించారు. హూజూరాబాద్ నియోజక వర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, మహిళలను ఈ అవగాహన సదస్సుకు ఆహ్వానించారు.


ఇక హుజూరాబాద్ నియోజక వర్గంలోని మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డు నుంచి నలుగురిని ఈ సదస్సుకు ఆహ్వానించారు. సదస్సుకు గ్రామస్థులతో పాటు 15 మంది రిసోర్సు పర్సన్లకు కూడా ఆహ్వానాలు వచ్చాయి. దళితబంధు పథకం ఉద్దేశం, అమలు గురించి సీఎం కేసీఆర్ వారికి వివరించనున్నారు. దళిత బంధు పథకం పర్యవేక్షణ, నిర్వహణ ఎలా ఉంటే బావుంటుందో చర్చించనున్నారు. పథకం విజయవంతానికి అవసరమైన చర్యల గురించి సీఎం కేసీఆర్ దళితులతో వివరంగా చర్చించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: