హుజూరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ ఎలాగైనా గెలవాలని దీంతో ఇతర పార్టీలకు బుద్ది చెప్పాలని టీఆర్ ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అనూహ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలకు బీజం పడింది. ఈటల ఆత్మగౌరం పేరుతో టీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చి ఎవరూ ఊహించని రీతిలో బీజేపీలో చేరాడు. హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ఆయా పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి.
అయితే ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని అధికార టీఆర్ ఎస్ పార్టీ కంకణం కట్టకుని ఉందని తెలుస్తోంది. ఉప ఎన్నికల నేపథ్యంలో పలు పథకాలను గులాబీ బాస్ కేసీఆర్ ప్రవేశపెడుతున్నాడు. ఇందులో ముఖ్యంగా `దళిత బంధు` అని చెప్పొచ్చు. ఈ పథకం ద్వారా దళితుల అభివృద్ది చెందుతారని చెబుతున్నారు సీఎం కేసీఆర్. కానీ ఇది కేవలం ఎన్నికల స్టంట్గానే పలువురు అంటున్నారు. స్వయంగా గులాబీ బాసే `దళిత బంధు`ను ఎన్నికల వ్యూహంగా అమలు చేస్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ హుజురాబాద్లో గెలవడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే ఈ పథకానికి లక్షకోట్లు అయినా ఖర్చు పెడతామని సీఎం వ్యాఖ్యల పట్ల పలు అనుమానాలు రేకెత్తుతుండం సహజం. హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ ఈ పథకాన్ని తీసుకోచ్చి.. పైలట్ ప్రాజెక్ట్గా హుజురాబాద్లో నియోజకవర్గం నుంచే మొదలు పెడుతున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలాగే ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అధికార పార్టీ హుజురాబాద్లో ప్రచారానికి ఏకంగా కులానికో మంత్రిని దింపింది.
హుజురాబాద్లో అధికంగా ఉన్న దళిత సామాజిక వర్గాన్ని దళిత బంధు ద్వారా ఆకర్షిస్తునే వారిని ఆకట్టుకునేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్ను రంగంలోకి దించింది. అలాగే గిరిజనుల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం మంత్రి సత్యవతి రాథోడ్ను, కల్లు గీత కార్మికుల ఓట్ల కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్ను బరిలోకి దింపింది. ఇక బలమైన సామాజిక వర్గమైన రెడ్డి, కమ్మ సామాజిక వర్గం మెప్పుకోసం ధర్మారెడ్డి, పెద్దిరెడ్డి లాంటి వారిని హుజురాబాద్లో మకాం వెయాల్సిందిగా టీఆర్ఎస్ అధిష్టానం సూచించింది.
హుజురాబాద్లో మరో బలమైన సామాజిక వర్గం యాదవులు వీరిని ఆకర్షించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను రంగంలోకి దింపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన రెండో విడత గొర్రెల పంపిణీని కేవలం హుజూరాబాద్లోనే ప్రభుత్వం ప్రారంభిస్తోంది. బుధవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారు. ఇలా అన్ని సామాజిక వర్గాలను ఆకట్టకునేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ వేస్తూనే ఉన్నారు. అయితే స్వరాష్ట్రం ఏర్పడ్డాకా తొలి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడని ప్రకటించిన కేసీఆర్ మాటలు ఇప్పుడు దళిత బందు మైమరిపిస్తుందో చూడాలి.