తాడేపల్లి : వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమపై అనుచిత వ్యాఖ్యలు చేశారు జోగి రమేష్. దేవినేని ఉమ కుక్క మొరిగినట్లు మొరుగుతున్నాడని ఫైర్ అయిన జోగి రమేష్.... మట్టి, ఇసుక, బూడిద కూడా దోచుకున్న వ్యక్తి దేవినేని ఉమ అని నిప్పులు చెరిగారు. ఎస్సీ లు, ఎస్టీలు, బీసీల పై దాడి చేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు జోగి రమేష్. ఎస్సీ లు, ఎస్టీలు, బీసీలను తిడితే కేసులు పెట్టరా? అని పేర్కొన్నారు. దేవినేని ఉమకు తగిన శాస్తి జరగాల్సిందేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జోగి రమేష్.
కొంచెం కూడా బుద్ధి లేని వ్యక్తి దేవినేని ఉమ అని నిప్పులు చెరిగారు. తన కారు పై దాడి చేస్తే టీవీ ఛానళ్ళకు ఉమ దర్జాగా ఎలా మాట్లాడారు? అని ప్రశ్నించారు. దేవినేని ఉమాపై తగిన కేసులు పెట్టాలని ఏపీ డీజీపీ గౌత్మ్ సవాంగ్ ను విజ్ఞప్తి చేశారు జోగి రమేష్. దేవినేని ఉమతో పాటు గూండాలు, రౌడీలు వచ్చారని ఆరోపణలు చేశారు. తమ పై ఎవరు దాడి చేసినా... తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు జోగి రమేష్. అక్రమ మైనింగ్ జరగటానికి ఈ ప్రభుత్వంలో అవకాశమే లేదని పేర్కొన్న జోగి రమేష్... పెయిడ్ మీడియాను తీసుకుని వెళ్లి డ్రామా చేయటానికి ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడ్డారని చురకలు అంటించారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై దురద జల్లే ప్రయత్నాలను ఇప్పటికైనా... తెలుగు దేశం నేతలు ఆపాలని జోగి రమేష్ అన్నారు. లేని యెడల ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు... తెలుగు దేశం నేతలకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు జోగి రమేష్. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కోసం అనేక అభివృద్ధి పథకాలు తీసుకువచ్చింది వైసీపీ సర్కార్ అని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని జోగి రమేష్ స్పష్టం చేశారు.