వైసీపీ యువనేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ అంచనాలకు అందకుండా వైసీపీలో దూసుకుపోతున్నారు. అదేంటో గాని పార్టీలో చాలా మంది నేతలు ఉన్నా కూడా జగన్ అవినాష్కు కాస్త ఎక్కువే ప్రయార్టీ ఇస్తున్నారు. విజయవాడ రాజధాని కేంద్రం కావడంతో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల విషయంలో అవినాష్ జగన్ను సులువుగా కలవడంతో పాటు నియోజకవర్గ అభివృద్ది గురించి ఎన్నో అంశాలపై చర్చిస్తున్నారు. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు సీటును వైసీపీ కోల్పోయింది. ఆ తర్వాత పార్టీ కీలక నేతలు పట్టుబట్టి టీడీపీలో అసంతృప్తితో ఉన్న అవినాష్ను పార్టీలో చేర్చుకున్న వెంటనే ఆయనకు తూర్పు పార్టీ పగ్గాలు ఇచ్చేశారు. పార్టీ పగ్గాలు స్వీకరించినప్పటి నుంచి ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా నియోజకవర్గంలో రౌండ్లు మీద రౌండ్లు వేసేస్తున్నారు.
అవినాష్ డైలీ షెడ్యూల్ చూస్తే ఆయన ఎన్ని పర్సనల్ పనులతో బిజీగా ఉన్నా కూడా నియోజకవర్గంలో ఏదో ఒక డివిజన్లో తిరుగుతూనే ఉండాల్సిందే..! ఆ కష్టానికి తగ్గ ఫలితమే గత కార్పోరేషన్ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ సత్తాచాటింది. మరోవైపు విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ గత రెండు ఎన్నికల్లోనూ సులువుగా గెలుస్తూ వచ్చారు. అయితే అవినాష్ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లినప్పుడు కూడా ఈ పిల్లాడు తననేం చేస్తాడులే అని ఆయన లైట్ తీస్కొన్నారు. అయితే యేడాదిలోనే గద్దె సీన్ రివర్స్ అయిపోయింది.
అవినాష్ ఇన్చార్జ్గా వచ్చిన వెంటనే పార్టీ కేడర్కు అనతి కాలంలోనే చేరువు అయ్యాడు. కులాలకు, మతాలకు అతీతంగా యువతను తన వైపునకు తిప్పుకున్నాడు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే అక్కడ వాలిపోతున్నాడు. దీంతో అవినాష్ ఎమ్మెల్యే చేయాల్సిన పనులను కూడా ఆయనే చేసేస్తున్నారు. దీనికి తోడు జగన్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. కావాలస్సినన్ని నిధులు వస్తున్నాయి. కరోనా కష్టకాలాల్లో ఎమ్మెల్యే గద్దె ఇంట్లో కూర్చుంటే అవినాష్ మాత్రం ప్రతి రోజు ఏదో ఒక డివిజన్లో పర్యటించి ప్రజలకు కావాల్సిన అన్ని పనులు చేశారు. దీంతో అటు పశ్చిమంలో మంత్రి వెల్లంపల్లి, సెంట్రల్లో సీనియర్ అయిన మల్లాది విష్ణులతో పోటీ పడుతూ ఇక్కడ పార్టీని అవినాష్ పరుగులు పెట్టిస్తున్నాడు.
ఈ క్రమంలోనే తన తండ్రి బలమైన రాజకీయ వారసత్వాన్ని బేస్ చేసుకుని మరో మూడు దశాబ్దాల పాటు బెజవాడ రాజకీయాల్లో కీలక నేతగా ఎదగాలన్న లక్ష్యంతోనే అవినాష్ రాజకీయం చేస్తున్నారు. అవినీతి, అలసత్వం అన్న విషయాలనే ఆయన దరిచేరనివ్వడం లేదు. అదే సమయంలో జగన్ నాయకత్వంలో జీవితాంతం పని చేయాలన్నదే తన ఆశయం, లక్ష్యం అని కూడా అవినాష్ చెపుతున్నారు. ఏదేమైనా భవిష్యత్తులో జగన్ కోటరీలో అవినాష్ కీలకం కానున్నారన్నది వాస్తవం..!