తెలంగాణ రాష్ట్రం లో కరోనా పూర్తిగా అదుపులో ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. డెల్టా వేరియెంట్ మన దేశంతో పాటూ మొత్తం 130దేశాల్లో చాలా ఇబ్బందులు పెట్టిందని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా మన పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులలో యాబై శాతం కేసులు కేరళ లోనే నమోదు అవుతున్నాయని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వాక్సినేషన్ ఎక్కువగా జరిగిన దేశాల్లో కూడా కేసులు నమోదు అవుతున్నాయని.. కానీ లక్షణాలు మైల్డ్ గా ఉంటున్నాయని చెప్పారు. డెల్టా, డెల్టా ప్లస్ రెండూ వేరియంట్ లు కూడా దాదాపుగా ఒక్కటే లాగా ఉన్నాయని శ్రీనివాసరావు చెప్పారు. అంతే కాకుండా ప్రమాదకరమైనవి ఏమి కాదని.. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు.
అయితే నిర్లక్ష్యంగా మాత్రం వ్యవహరించకూడదు అని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించకపోతే ఔట్ బ్రేక్ అవుతున్నాయని శ్రీనివాస రావు అన్నారు. ఖమ్మం కూసుమంచి గ్రామంలో కూడా ఇలాంటివే చూస్తున్నామని చెప్పారు. కరోనా పాజిటివ్ అని తెలియక ప్రజల మధ్యలో తిరగటం వల్ల స్ప్రెడ్ ఎక్కువగా అవుతోందని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, జీహెచ్ఎంసీ, ఖమ్మంలో ఎక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు. అయితే వీటిలోనూ కొన్ని మండలాల్లో కేసులు ఉంటున్నాయని చెప్పారు.
మన రాష్ట్రంలో స్వీయనియంత్రణ లేకపోతే కరోనా కేరళ లాగా పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో వ్యాక్సిన్ ల కొరత కొరత కూడా భారీగానే కనిపిస్తోంది. ప్రతిరోజూ వ్యాక్సిన్ ల కోసం గ్రామాలలో ప్రజలు పీహెచ్ సీల ముందు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో తోపులాటలు కూడా జరుగుతున్నాయి. ఒకరోజు రెండో డోస్ వేస్తే..మరొక రోజు ఫస్ట్ డోస్ వేయడం వల్ల కూడా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లోనూ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇలాంటి సమయంలో ప్రభుత్వం త్వరగా వ్యాక్సిన్ లను అందుబాటులోకి తీసుకువచ్చి అందరికీ వ్యాక్సిన్ లు వేయాలని ప్రజలు కోరుతున్నారు.