ఏపీలో రావులపాలెం - తణుకు చరిత్ర గత వైభవమేనా.. ఏం జరుగుతోంది ?
ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి - తూర్పు గోదావరి సరిహద్దుల్లో ఉన్న తణకు - రావులపాలం గత ఇరవై ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందాయి. అయితే ఇప్పుడు ఈ రెండు పట్టణాల వైభోగం గతం కానుందా ? అని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దశబ్దాల నుంచి వ్యాపార కూడళ్ళుగా ఉన్న రావులపాలెం, తణుకు వంటి కేంద్రాల భవితవ్యం మారబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో మరో కొత్త రహదారి ఏర్పడడమే ? విజయవాడ, విశాఖ మధ్య సమాన దూరంలో రాజమండ్రి ఉంది.
అయితే రాజమండ్రికి ధీటుగా తణుకు, రావులపాలెం ఎదిగాయన్నది నిజం. ఇక కోనసీమ ముఖద్వారంగా రావులపాలెం, ఆంధ్రా సుగర్స్ రాకతో తణుకు కొన్ని అవకాశాలతో పారిశ్రామికంగా కూడా పెద్ద కూడళ్లుగా మారాయి. ఈ రెండు బాగా అభివృద్ధి చెందడానికి జాతీయ రహదారిపైన ఉండడమే ప్రధాన కారణం. అయితే ఇప్పుడు ఏలూరు దాటాక భీమడోలు మండలంలోని గుండుగొలను - రాజమండ్రిని ఆనుకుని ఉన్న దివాన్ చెరువు రోడ్డు పూర్తవుతున్న దశలో వాహనాలన్నీ కొత్త దారిలో మళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభావం పడింది.
అప్పుడు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు తణుకు, రావులపాలెం మీదుగా రాజమండ్రి రావక్కర్లేదు. గుండుగొలను నుంచి కొవ్వూరు మీదుగా రాజమండ్రి వెళ్లడం సులువు అవుతుంది. అదే జరిగితే తణుకు, దానికి మించి రావులపాలెం ప్రభావితం కావడం ఖాయం. ఇప్పటికే దేవరపల్లి, నల్లజర్ల, భీమడోలు వంటి మండల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బైపాస్ అందుబాటులోకి రావడం వల్ల ఇప్పటికే ఆ సెంటర్లు కొంత కళ తప్పుతున్నాయనే చెప్పాలి. వాటి స్థానంలో కొత్త వ్యాపార కూడళ్ళు వెలుస్తోన్న పరిస్థితి ఉంది.