మూడేళ్లలో మన రోడ్లు.. అమెరికాను తలదన్నుతాయట..?

Chakravarthi Kalyan
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన రోడ్లు అంతగా బావుండవన్న సంగతి తెలిసిందే.. జాతీయ రహదారులు మాత్రమే కాస్త బావుంటాయి.. ఇక రాష్ట్ర రహదారులు, గ్రామాల రహదారుల సంగతి చెప్పనక్కర్లేదు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి ఈ రహదారులే.. ఈ జాతీయ రహదారులైనా కాస్త ఇటీవలి కాలంలో బావుంటున్నాయి. వాజ్‌పేయి హయాంలో స్వర్ణ జయంతి స్వర్ణభుజి పేరిట జాతీయ రహదారులను అభివృద్ధి చేశారు. అయితే ఇకపై మాత్రం మన రోడ్లకు మహర్దశ పట్టబోతోందట.  


వచ్చే మూడేళ్లలో మన దేశంలో జాతీయ రహదారులు అమెరికాలో ఉన్నట్లుగా రూపొందుతాయట. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెబుతున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతోందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇదే సమయంలో ఆయన గత ప్రభుత్వాల్లో జరిగిన రోడ్ల నిర్మాణం.. మోదీ సర్కారు హయాంలో జరిగిన రోడ్ల నిర్మాణాలను పోల్చి చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో రోజుకు కేవలం రెండు కిలోమీటర్ల రోడ్లు నిర్మించారట. ఇప్పుడేమో రోజూ 38 కిలోమీటర్లు నిర్మిస్తున్నారట.


ఇంతకీ ఇప్పుడు ఈ విషయాలన్నీ కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఎందుకు చెప్పారంటే.. ఆయన గుజరాత్‌ దీసా పట్టణంలో ఓ నాలుగు లైన్ల జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో కలిసి పాల్గొన్నారు. 3.75 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారిని గడ్కరీ జాతికి అంకితం చేశారు. గుజరాత్‌లో రహదారుల ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయన్న కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ.. అదే సమయంలో భూ సేకరణ సమస్యలు పరిష్కరించాలని సీఎం రూపానీని కోరారు.

గుజరాత్‌లో 25వేల 370 కోట్ల రూపాయల విలువైన వెయ్యి 80 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరుగుతోందట. అవును మరి ఇప్పుడు దేశంలో ఎక్కువ సౌకర్యాలు అందుకుంటున్న రాష్ట్రం గుజరాతే కదా మరి.. ఏమంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: