మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్... రాజీనామా అనంతరం హుజురాబాద్ నియోజక వర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం అందరికీ తెల్సిందే. అయితే.. హుజురాబాద్ నియోజక వర్గంలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే... రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓవైపు అధికార టి ఆర్ యస్ పార్టీ ఒకడుగు ముందుకేసి నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో క్యాడర్ దించి హడావుడి చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పార్టీ నేతలతో సమావేశమై హుజురాబాద్ ఎన్నికపై చర్చించనున్నారు.
తమ పార్టీ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీలో యువ నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో... గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే.. టీఆర్ఎస్ పార్టీలో ఉంటున్న నాయకుడు కావడం విశేషం. ఇక అటు ఈటల ఎపిసోడ్ తర్వాత మొదటి సారిగా హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు అడుగు పెట్టనున్నారు. 3 రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో అంతర్గత సమావేశాల్లో పాల్గొని దిశా నిర్దేశం చేయనున్నారు. బైక్ ర్యాలీ , అమరవీరుల స్థూపం వద్ద నివాళులు, జమ్మికుంట రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో హరీష్ రావు పాల్గొననున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో దళిత బంధు అమలు, చెక్కుల పంపిణీ ఏర్పాట్లు పై సమీక్ష నిర్వహించనున్నారు.. కొంతకాలంగా ఈటల , హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో మంత్రి హరీష్ రావు హుజురాబాద్ పర్యటన ఆసక్తిగా మారింది. కాగా.. అటు బీజేపీ పార్టీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ లేదా ఆయన సతీమణి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇటు కాంగ్రెస్ అభ్యర్థి గా ఎవరనేది క్లారిటీ రాలేదు.