విజయవాడ లో జరిగే రాష్ట్ర స్థాయి పంద్రాగస్టు వేడుకల నేపథ్యం లో పోలీసుల ఆంక్షలు విధించారు. స్వాతంత్య్ర వేడుకలకు హాజరయ్యే వారికి తప్పనిసరిగా పోలీస్ పాస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ పాస్ లేకుండా లోనికి ఎవరికీ కూడా అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. పాసులున్న వారు ఉదయం 7.45 నిమిషాలకే స్టేడియాలని చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఈ పంద్రాగస్టు వేడుకల సందర్భం గా రేపు విజయవాడ నగరంలో ట్రాఫిక్ ను కూడా మళ్లించారు అధికారులు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక కంట్రోల్ రూమ్ నుంచి బెంజి సర్కిల్ వైపు వెళ్లే వాహనాలను ఇతర మార్గాల గుండా మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బస్టాండ్, మార్కెట్ నుంచి బందర్ రోడ్డు వైపు వెళ్లాల్సిన బస్సులు 5 వ నెంబరు రూట్ లోకి మళ్లించనున్నారు. 5 వ నెంబర్ రూట్ లో వెళ్లాల్సిన బస్సులన్నీ ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్ వయా బెంజి సర్కిల్ మీదుగా మళ్లించారు అధికారులు. పంద్రాగస్టు వేడుకల నేపథ్యం లో ఎలాంటి అనుమానితులు కనిపించినా.. కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు ఉన్నాతాధికారులు.
ఇక ఇది ఇలా ఉండగా.. రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమం రద్దు అయింది. కరోనా మహమ్మారి పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఎట్ హోం కార్యక్రమాన్ని రద్దు చేసారు ఏపీ గవర్నర్. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్లో గౌరవ గవర్నర్ 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని నిర్వహించడం అనవాయితీ వస్తోంది. కానీ కరోనా ఇక్కట్లతో ప్రస్తుత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సామూహిక కార్యక్రమాన్ని నిర్వహించరాదని నిన్న ఆదేశించారు గవర్నర్.