ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వివాదాలు సృష్టించి, ఘాటుగా స్పందించేటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈరోజు సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి పార్టీ అని, ప్రజా సంగ్రామ యాత్ర తరువాత బిజెపి పార్టీ పరిస్థితులు మారబోతున్నాయి అని అన్నారు. ఇప్పటివరకు ప్రజా సంగ్రామ యాత్ర వంద రోజులు పూర్తి చేసుకుందని ఆయన తెలిపారు. దేశంలో హిందువులు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాం అని, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హిందువులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. హిందువుల మనోభావాలను ఏపీ సీఎం జగన్ కించపరుస్తున్నారని విమర్శించారు.
వినాయక చవితిని ఇళ్లల్లోనే జరుపుకోవాలన్న నిబంధన సరైంది కాదని, రంజాన్, క్రిస్మస్ పండుగలు ఇళ్ళల్లో కాకుండా.. మజీద్, చర్చిల్లో ఎందుకు జరుపుకున్నారని వారికి ఒక న్యాయం హిందువులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు మేరకు వినాయక చవితి జరుపుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సహా.. దేశంలో హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తానని, హిందువుల తరఫున ప్రశ్నించడానికి బీజేపీ ఎప్పుడూ ముందు ఉంటుందని తెలియజేశారు.
తెలంగాణలో టీఆర్ఎస్ తో కలసి బీజేపీ పోటీచేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా తనకు అపాయ్మెంట్ ఇచ్చినట్లే.. సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతలకు, ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాలని, కెసిఆర్ కు మొండివైఖరి పనికిరాదని ప్రశ్నించారు. గోషామహాల్ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయ్మెంట్ రెండేళ్ళుగా కోరుతుంటే స్పందించే నాదుడు లేడని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందని, ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత తెలంగాణలో రాజకీయాలు మారబోతున్నాయని తెలియజేశారు. ఈరోజు వరకు వంద కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నామని తెలియజేసారు.