ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్.. ఎవరూ బయటకు రావొద్దు..!

NAGARJUNA NAKKA
తెలంగాణ రాష్ట్రంలో రాగల48గంటల్లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచిస్తోంది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో జడివానలు.. రేపు ఆదిలాబాద్, కుమ్రం భీం, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. అక్కడి నుంచే సీఎంస్ సోమేస్ కుమార్ మాట్లాడారు. ఈ సమీక్షలో సీఎస్ సహా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.

అటు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎస్.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పిన సీఎస్ సోమేశ్ కుమార్.. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఉపయోగించుకోవాలని చెప్పారు.

భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మూలవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి రెండోసారి కూలిపోయింది. 2019లో బ్రిడ్జి కూలిపోగా 28కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం ప్రారంభించారు. తాజాగా సెంట్రింగ్ పనులు జరుగుతుండగా అది ఒక్కసారి కుప్పకూలింది. నాసిరకం పనుల వల్లే ఇలా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.

ఇక ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈ రోజు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ రోజు సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్లు తెలిపారు. అటు ఎస్ఆర్ఎస్ పి 30గేట్లు ఎత్తి 1.96లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. వరంగల్ జిల్లాలో భారీ వర్షానికి పలు కాలనీలు నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలెవరూ బయటకు రావొద్దని.. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సూచించారు.








మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: