ఈ సారి ఎన్నికలు అటు బొత్సనూ ఇటు ఇంకొందరి సీనియర్లనూ ప్రభావితం చేశాయి అనే చెప్పాలి. జగన్ వీర విధేయత అనే మా టను ప్రామాణికంగా తీసుకుంటే శ్రీకాకుళం జెడ్పీ పీఠం పిరియా సాయిరాజు (కాళింగ) భార్య పిరియా విజయ (బలిజ) ను వరిం చనుంది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం అని, ఆమె తండ్రి తెనాలి ఆర్డీఓ పనిచేసి పదవీ విరమణ పొందారని తెలుస్తోంది. సాయి రాజు తొలి నాళ్లలో ఎర్రన్నాయుడికి ఎంతో చేరువ. ఆయన సహ కారంతోనే ఇచ్ఛాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు కూడా! తరువాత పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీని వీడి వైసీపీ గూటికి వచ్చేశారు. ఈ మధ్యనే డీసీఎంస్ చైర్మన్ గా పనిచేసి పదవీ కాలం ముగియడంతో తప్పుకు న్నారు. సాయి రాజు స్వభావ రీత్యా ఆవేశపరుడు. రాష్ట్రమంత్రి సీదిరి అప్పలరాజుకు సన్నిహిత మిత్రుడు.
ఆయన భార్యకు ఇప్పుడు జెడ్పీ పీఠం వరించడమే కాదు కాళింగ సామాజిక వర్గం నడిపే పదవిగా ఉండడం విశేషం. గతంలోనూ చంద్రబాబు హయాంలో చౌదరి ధనలక్ష్మికి (వీరూ విధేయులే, ఎర్రన్న సన్నిహితులే) పదవి ఇచ్చారు. అటుపై ఆమె ఎన్నో ఇబ్బందులు పడ్డారు. స్థానికంగా ఉద్యోగుల్లో ఉన్న వర్గ విభేదాలు పరిష్కరించలేక చతికిల పడ్డారు. పీఏ కారణంగానూ కొన్ని సమస్యలు వచ్చాయి. సామాజికంగా ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఎందుకనో తనదైన ముద్ర వేయలేకపోయారు. విమర్శల పాలయ్యారు. తాజాగా ఇప్పుడు అదే సామాజికవర్గంకు చెందిన కుటుంబం నుంచి విజయ వస్తున్నారు. ఆమె తన భర్తతో కలిసి ఉద్దాన ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కరోనా టైం లో రెండు అంబులెన్సులను కొనుగోలు చేసి అప్పటి కలెక్టర్ నివాస్ కు అందించారు. గ్రామాలలో మంచి పట్టున్న నాయకుడు పిరియా సాయిరాజు. ఆ విధంగాచూసుకుంటే జగన్ మరో సారి విధేయుడికే పట్టం కట్టారు. మరో విధేయుడు మజ్జి శ్రీనివాసరావు ఉరఫ్ చిన్న శ్రీను. విజయనగరం కేంద్రంగా రాజకీయాలు నిర్వహిస్తున్న చిన్న శ్రీను. బొత్సకు అత్యంత సన్నిహితుడు. ఈయన కాపు సామాజికవర్గంకు చెందిన నేత.ఈయన కూడా విధేయుడే. ఆ విధంగా ఇద్దరి విధేయులకు జెడ్పీ పీఠాలు పక్క పక్క జిల్లాల్లోనే దక్కనుండడం విశేషం.