మెగాస్టార్ డైరెక్షన్... ముద్రగడ యాక్షన్.. తెరవెనక తంతు ఇదేనా..!
విషయం ఏంటంటే.. తాజాగా ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్లను ఆన్ లైన్లో విక్రయించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ, ప్రభుత్వం మాత్రం.. మా తప్పు లేదు.. సినీ వర్గాలు మమ్మల్ని బలవంతం చేస్తున్నాయి. అందుకే.. మేం టికెట్లు విక్రయించాలని నిర్ణయించాం.. అని మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. దీనిపై రోజా సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా సమర్ధించుకున్నారు. మమ్మల్నెందుకు తప్పు పడుతున్నారు.. సాక్షాత్తూ సినిమా నిర్మాతలు అమ్మాలని సూచించారని అందుకే తాము సినీ టికెట్లు అమ్ముతున్నామని చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు ముద్రగడ సడెన్గా లైన్లోకి వచ్చి లేఖ రాయడం వెనక చాలా జరిగిందనే అంటున్నారు. ముద్రగడ పద్మనాభం, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ కూడా కాపు వర్గం వారే. పైగా ముద్రగడ గతంలో సినిమా డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉన్నారు. ప్రస్తుతం జగన్ సర్కార్ చర్యలతో ఏపీలో సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటోన్న ఇబ్బందుల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రెండు రోజుల క్రితం లవ్స్టోరీ సినిమా ఫంక్షన్లో తన ఆవేదన వెళ్లగక్కారు. ఇప్పుడు కూడా ఆయన డైరెక్షన్లో ముద్రగడ జగన్కు లేఖ రాసినట్టు టాక్ ?
ముద్రగడ నటులకు ఇచ్చే రెమ్యునరేషన్లు, ఇతర ఖర్చులను నిర్మాత నుంచి మొత్తం డబ్బంతా ప్రభుత్వమే జమ చేయించుకోవాలన్నారు. ఆన్ లైన్లో టిక్కెట్ల మాదిరిగా ప్రభుత్వమే సినీ నటుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు పంపిస్తే బాగుంటుందన్నారు. దీనివల్ల దుబారా, ఎగవేతలు ఉండవని సూచించారు. ఎక్కడా తెలుపు, నలుపు, ధనం పదాలు వినిపించవన్నారు. పూర్తిగా వైట్ మనీతోనే వ్యాపారం జరుగుతుందని చెప్పారు. అయితే ఇందులో ఆయన వ్యంగ్య ధోరణి కనపడింది. ఏదేమైనా ఇప్పుడు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలే ఎక్కువ మంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఏపీలో పరిణామాల నేపథ్యంలో మిగిలిన వారికన్నా చిరంజీవే ఎక్కుడ హడలి పోతున్నారు. ఇందుకోసం ఆయన అస్త్రశస్త్రాలను వాడుతున్నారని అంటున్నారు.