గోవాపై దీదీ కన్ను.. ఇక `ఖేలా హోబే`..!
పశ్చిమ బెంగాల్ తరహాలోనే గోవాలోనూ ఖేలా హోబే ప్రచారాన్ని ప్రారంభించింది తృణముల్ సివంగి మమతా బెనర్జీ. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఓడించేందుకు బెంగల్ తో గోవాకు ఉన్న సారూప్యతల్ని తెరపైకి తీసుకొస్తోంది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయారు. ఇప్పుడు తన పాత నియోజకవర్గం భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ మమత గెలుపు లాంఛనమే దీంతో భవానీపూర్తో పాటు గోవా రాజకీయాలపైనా దృష్టి సారిస్తున్నారు మమతా బెనర్జీ. వచ్చే ఎన్నికల్లో ఎలాగైన గోవాలో విజయకేతనం ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి విజయభావుటా ఎగురవేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. సీనియర్ నేత మనోహర్ పారికర్ మరణంతో బీజేపీకి గోవాలో స్టార్ కాంపెనియర్ లేకుండా పోయింది. అలాగే బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న వేళ గోవాలో అడుగుపెట్టేందుకు ఇదే సరైన సమయం అని తృణముల్ కాంగ్రెస్ నాయకురాలు దీదీ భావిస్తున్నారు.
ఇప్పటికే టీఎంసీలోని జాతీయ రాజకీయాలను చూసే ఇద్దరు కీలక నేతలను గోవా రాష్ట్రానికి పంపారు మమతా బెనర్జీ. ఎంపీ డెరాక్ ఓబ్రెయిన్ ప్రసూన్ బెనర్జీలను గోవాకు పంపించారు. గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెడితే గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటి అనే విషయాలను వీరు సేకరిస్తున్నారు.