టీడీపీలో ఇంత జరుగుతోందా.... 2024లో ఆశల్లేనట్టేనా ?
గత 2019 ఎన్నికల తర్వాత.. టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. పార్టీలో సీనియర్లు, ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడిపోయారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్.. వంటివారు ప్రత్యక్షంగా పార్టీకి దూరమయ్యారు. ఇక, గంటా శ్రీనివాసరావు.. పరోక్షంగా పార్టీకి దూరంగా ఉన్నారు. మిగిలిన వారిలోనూ చాలా మంది పైకి పార్టీ కార్యక్రమాలకు వస్తున్నా.. అంతర్గతంగా అధికార పార్టీకి సహకరిస్తున్నట్టు చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి. ఇదిలావుంటే.. పార్టీని వీడి పోయే వారు కూడా పెరుగుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన.. తోట త్రిమూర్తులు పార్టీ మారి.. ఎమ్మెల్సీ అయ్యారు.
ఇక, గత ఎన్నికల్లో ఓడిపోయిన చాలా మంది పార్టీకి దూరంగా ఉన్నారు. కొందరు ఉన్నా.. అచేతనంగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క.. తాజాగా .. మంగళగిరిలో కీలక నాయకుడిగా ఉన్న మురుగుడు హనుమంత రావు కూడా పార్టీకి గుడ్బై చెప్పారు. ఇక, జేసీ బ్రదర్స్ ఉన్నారో లేదో తెలియదు. ఉన్నా.. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ.. నిత్యం హీటెక్కిస్తున్నారు. ఇక, మరో సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తానంటూ.. హడావుడి చేశారు. ఇక, ఓ ఎంపీ.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో రోడ్డున పడ్డారు.అదేమంటే.. నేను పోటీ చేయను.. అని చెబుతున్నారు. చేయాల్సిన నష్టం చేసేసి.. నేను పోటీ చేయను.. అని చెబుతున్నా.. పార్టీలోనే ఉంటూ.. రాజీనామా చేస్తానని బెదిరించినా.. వీరిని అడిగే నాథుడు కరువయ్యారు.
పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు.. నారా లోకేష్ పుంజుకునే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదని.. సొంత పార్టటీ నేతలే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో పార్టీని ముందుకు నడిపించడం.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని గాడిలో పెట్టడం.. చంద్రబాబు కత్తిమీద సామేనని అందరూ అంటుంటే.. ఇవి మాకు మామూలే.. పార్టీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా.. ఇలాంటి సవాళ్లు స్వీకరిస్తూనే ఉందని.. నెమ్మదిగా చెబుతున్నారు మరికొందరు. మరి ఇలాంటి పరిసస్థితిలో ఉన్న పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేయకపోగా.. ఇలా ఉదాసీనంగా వ్యవహరించడంపై పార్టీ అభిమానులు మండిపడుతున్నారు. ఎక్కడో ఒక చోట.. చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి కదా! అంటున్నారు. ఎంత సేపు పార్టీ నేతలకు భయపడతారని ప్రశ్నిస్తున్నారు.