బాబు...పవన్‌కు ఆ ఛాన్స్ ఇస్తే బ్యాండ్ ప‌డిపోతోందిగా..!

VUYYURU SUBHASH
గత రెండున్నర ఏళ్లుగా సైలెంట్‌గా ఉన్న జనసేన అధినేత పవర్ స్టార్  పవన్ కల్యాణ్ ఒక్కసారిగా దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అసలు ఎప్పుడూలేని విధంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే, జగన్ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. అటు వైసీపీ సైతం పవన్ టార్గెట్‌గా కౌంటర్లు ఇస్తుంది. ఇక యథావిధిగానే బూతులతో మంత్రులు రెచ్చిపోతున్నారు.

ఇదే క్రమంలో పవన్ వెనుక చంద్రబాబు ఉన్నారని చెప్పి విమర్శిస్తున్నారు. బాబు-పవన్‌లు ఒక్కటే అని వైసీపీ అంటుంది. వైసీపీ చేసే విమర్శలు ఏమో గానీ త్వరలోనే టి‌డి‌పి-జనసేనలు పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. వైసీపీకి చెక్ పెట్టడానికి రెండు పార్టీలు ఒక్కటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సరే పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా సరే చంద్రబాబు, అనవసరంగా పవన్ కల్యాణ్‌కు ఛాన్స్ ఇచ్చేస్తున్నారనే విశ్లేషకులు మాట్లాడుతున్నారు.

ఇప్పుడు పవన్ హైలైట్ అవ్వడం వల్ల చంద్రబాబు కనబడటం లేదు. దీని వల్ల టి‌డి‌పికే డ్యామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పవన్ ఏమో హడావిడిగా వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ప్రజా సమస్యలని అడ్రెస్ చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు టి‌డి‌పి చేస్తున్న కూడా హైలైట్ కావడం లేదు. దీని వల్ల టి‌డి‌పి శ్రేణులు చాలా అసంతృప్తిగా ఉన్నాయి.

ఒకవేళ పవన్ మద్ధతు పలికిన సరే....టి‌డి‌పినే వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఉండాలి గానీ, అనవసరంగా జనసేనకు సీన్ ఇస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. పైగా బద్వేలు ఉపఎన్నికలో మొదట పోటీ చేయాలని ఫిక్స్ అయ్యి, పవన్ తప్పుకుంటున్నాని ప్రకటించాక, చంద్రబాబు కూడా అదే దారిలో వెళ్ళడం వల్ల ప్రజలకు వేరేగా సంకేతాలు వెళుతున్నాయని చెబుతున్నారు.

ఇప్పుడు ఏదో పవన్‌...వైసీపీని తిడుతున్నారు గానీ సంబరపడితే తర్వాత టి‌డి‌పికే ఇబ్బంది అవుతుందని, కాబట్టి చంద్రబాబు కూడా దూకుడుగా ఉండాలసిన అవసరముందని అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: