పార్టీల ఇజ్జత్ కు సవాల్ గా మారిన హుజురాబాద్ ఉప ఎన్నిక...

VAMSI
తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. గత కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడు ఈ ఎన్నిక జరుగుతుందా అని అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశాయి. తెలంగాణ రాష్ట్రంలో నెలాఖరులో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం గత కొన్ని నెలల నుండి అన్ని రాజకీయ పార్టీలు భారీ కసరత్తులు చేస్తున్నాయి. ఈ ఎన్నికలలో గెలుపు మాదంటే మాదే అని రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. అందులో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో పాలక పక్షం తెరాస కాగా మరొకటి జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ. ఎన్నికల పోటీలో ఎన్ని పార్టీలు పోటీ చేసినా అంతిమ పోరు మాత్రం బీజేపీ మరియు తెరాసల మధ్యనే ఉండనుంది అని చంటి పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు.

ఇందుకు కారణాలు అందరికీ తెలిసినవే. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో గెలిచి తన సత్తా ఏమిటో అధికార పార్టీకి చూపించాలనే కసితో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రగిలిపోతున్నాడు. నిన్న మొన్నటి వరకు ఒక రకం..ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాక ఇంకో రకం అన్నట్లు ఉంది ఇక్కడ హుజూరాబాద్ రాజకీయం. ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 9 నామినేషన్లు మాత్రమే వేయడం జరిగింది. ఈ విషయం ఎన్నికల అధికారి తెలియచేశారు. ఇప్పటికే తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ వేయడానికి చివరి తేదీ ఈ నెల 8, కాబట్టి  అదే రోజున కాంగ్రెస్ మరియు బీజేపీ అభ్యర్థులు అయిన బల్మురు వెంకట నరసింగరావు మరియు ఈటల రాజేందర్ నామినేషన్ వేయనున్నారు. ఈ ఎన్నిక తెలంగాణ రాజకీయాలకు ఒక ఇజ్జత్ కు సవాల్ గా మారుతున్నాయి.

ఈ ఎన్నికలో గెలిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు మరింత ఆత్మవిశ్వాసంతో  వెళ్లవచ్చని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది కాబట్టి వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఈ పోలింగ్ ఈనెల 30 న జరగనుంది మరియు  ఓట్ల లెక్కింపు అలాగే ఫలితాలను నవంబర్ 2 న నిర్వహిస్తారు. అలా మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల రభస నవంబర్ 5 తో పూర్తి అవుతుంది. మరి ఈ ఎన్నికలు పరువుకు ప్రతిష్టలు ప్రతీకగా నిలువనున్నాయి. ఈ పోరులో గెలుపు ఎవరిదో అన్నది తెలియాలంటే మరి నాలుగు వారాలు ఎదురు చూడక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: