మా ఎన్నికలకు సంబంధించి ఈ సారి రెండు ప్యానెళ్లూ బాగా పనిచేశాయి. రెండు నెలల ముందటే తన ప్యానెల్ ను ప్రకటించి ప్రకాశ్ రాజ్ ఎన్నికల శంఖారావం పూరించారు. అదేవిధంగా మంచు విష్ణు కూడా తన విజన్ ఏంటో ముందు నుంచి చెబుతూనే వస్తున్నారు. ఇవన్నీ ఫలించడం, మోహన్ బాబు లాంటి సీనియర్ నటులు ఫోన్లు చేసి మరీ! తన బిడ్డను ఆశీర్వదించాలని ఫోన్లు చేసి, సభ్యులను రిక్వెస్టు చేయడంతో ఈ సారి పోలింగ్ శాతం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆఖరు నిమిషాన ఇంకొన్ని ఓట్లు పోలయ్యే ఛాన్స్ ఉన్నందున పోలింగ్ సమయం మరో గంట పొడిగించారు. మధ్యాహ్నం మూడు గంటల వరకూ పోలింగ్ ను నిర్వహించేలా విష్ణు రిక్వెస్టు చేశారు. ఇంకొన్ని వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే.. గత ఎన్నికల్లో 474 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఉన్న సమాచారం ప్రకారం 508 ఓట్లు పోలయ్యాయి. అయినప్పటికీ ఇంకా ఎక్కువ ఓట్లు పోల్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తోంది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మరో 120 నుంచి 150 ఓట్లు అదనంగా పోల్ అయ్యే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా పోల్ స్లిప్ లు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం మూడు గంటల వరకూ పోలింగ్ పొడిగింపునకు ఎన్నికల అధికారులు సమ్మతించారు. విష్ణు చేసిన కృషి ఫలితంగా ఇంకొందరు బెంగళూరు నుంచి, చెన్నయ్ నుంచి కూడా వస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వీటికి అనుగుణంగా ఆలోచిస్తే..650 నుంచి 750 వరకూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. ఈ ఎన్నికల్లో మొదట్నుంచి వివాదం ఉన్న పోస్టల్ బ్యాలెట్ ప్రభావం కూడా సుస్పష్టంగా ఉండనుంది. అరవై ఏళ్లకు పైగా ఉన్న వారంతా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు.
ఈ క్రమంలోనే కృష్ణం రాజు, కృష్ణ తమ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారని ఇప్పటికే స్పష్టమైంది. వీటినన్నింటినీ పరిగణిస్తే అర్ధ రాత్రి దాటాక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని మా సభ్యులు చెబుతున్నారు. కౌంటింగ్ ప్రారంభం అయ్యాక మొదట ఈసీ మెంబర్ల ఎన్నిక కు సంబంధించి ఫలితం వెల్లడి కానుంది. తరువాతే వైస్ ప్రెసిడెంట్ , జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఫలితాలు ప్రకటితం అవుతాయి. ఆఖరుగా ప్రెసిండెంట్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది.