సజ్జనార్ సంచలన నిర్ణయం.. ఇక ఈ దసరాకి పండగే?
అయితే దసరా పండుగ వచ్చిందంటే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు భారీగా ఛార్జీలు పెంచి ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆర్టీసీ మాత్రం బంపర్ ఆఫర్లు ప్రకటించడం చేస్తూ ఉంటుంది. ఇక ఈ ఏడాది కూడా తెలంగాణ ఆర్టీసీ దసరా కానుకగా ప్రయాణికుల కోసం ఒక శుభవార్త సిద్ధం చేసింది. ఏకంగా 4035 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. కాని అంతలోనే సాధారణ చార్జీ కంటే 50 శాతం అదనంగా వసూలు చేస్తామని ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ప్రకటించి షాక్ ఇచ్చింది. అయితే కరోనా వైరస్ సమయంలో వ్యాపారాలు ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారిపై అదనపు భారం వేయడం సరికాదంటూ టిఎస్ఆర్టిసి నిర్ణయం పై విమర్శలు వచ్చాయి.
కాగా ఇటీవలే మరో సారి దీనిపై పునరాలోచించిన తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. దసరా సందర్భంగా టి ఎస్ ఆర్ టి సి లో ఇటీవలే ఛార్జీలను పెంచుతున్నట్లు చేసిన ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. అదనపు చార్జీలను ఎత్తి వేస్తున్నాము అంటూ సజ్జనార్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న సాధారణ చార్జీల కొనసాగిస్తాము అంటూ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు సజ్జనార్. అంతే కాదు ఇప్పుడు వరకు తీసుకున్న రిజర్వేషన్ల టిక్కెట్లు అదనపు చార్జీలను కూడా ప్రయాణికులకు వెనక్కి పంపించాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. దసరా పండగ వేళ సజ్జనార్ తీసుకున్న నిర్ణయం ప్రయాణికులకు శుభవార్త అని చెప్పాలి.