'మా' మంటలతో.. బీజేపీ చలి కాచుకుంటుందా..?

Chakravarthi Kalyan
మా ఎన్నికలు ముగిశాయి. మా అంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. అంటే.. సినిమా నటులకు చెందిన ఓ సంఘం.. నటుల సమస్యలు ఏమైనా ఉంటే చర్చించుకుని పరిష్కరించుకునే ఓ సంఘం.. నటుల ఇబ్బందుల గురించి చర్చించుకునే ఓ సంఘం.. ఇందులో సభ్యుల సంఖ్య వెయ్యి దాటదు. అందులోనూ.. ఇది సినిమా పరిశ్రమకు చెందిన అందరూ ఉండే సంఘం కాదు.. కేవలం నటులు మాత్రమే ఇందులో ఉంటారు. ఇతర టెక్నీషియన్లు, దర్శకులు.. ఇతర రంగాల వారు కూడా ఉండరు.


అలాంటి ఓ చిన్న సంఘం ఎన్నికలు మాత్రమే. అయినా వీటిపై అందరి ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే.. సహజంగానే సినిమా వాళ్లంటే సమాజానికి ఉండే ఇంట్రస్టు అలాంటిది.. అందులోనూ గతంలో ఈ పదవులకు అంతగా క్రేజ్‌లేని వాళ్లు, వయసైపోయిన వాళ్లు పోటీ పడే వారు. అందుకే ఎప్పుడూ ఇంత వివాదాస్పదం కాలేదు. కానీ.. ఈసారి మాంచి క్రేజ్ ఉన్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు పోటీలో ఉండటంతో అందరి కళ్లూ మా ఎన్నికలపై పడ్డాయి.


అయితే.. ఈ ఎన్నికల్లో పార్టీలు మొదటి నుంచి జోక్యం చేసుకోలేదు. అలాంటి విమర్శలు వస్తున్నాయనే ఏపీ సర్కారు మాకు సంబంధం లేదని ప్రకటన కూడా చేసింది. అయితే బీజేపీ మాత్రం ఈ విషయంలో అత్యుత్సాహం చూపిందని చెప్పాలి. బీజేపీ సభ్యుడైన సీవీఎల్ నరసింహారావు ప్రకాశ్‌రాజ్‌ తీవ్రంగా విమర్శిస్తూ ఏకంగా పార్టీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టారు. ప్రకాశ్‌ రాజ్‌ దేశ ద్రోహి, ధర్మద్రోహి అంటూ మండిపడ్డారు. ప్రకాశ్‌రాజ్‌ వంటి దేశ ద్రోహిని తప్పకుండా ఓడించాలన్నారు. ఇలా ఓ పార్టీ ఆఫీసులో ఎవరూ ఇప్పటి వరకూ ప్రెస్ మీట్ పెట్టలేదు.


ఇక ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా బీజేపీ దీన్ని వదిలిపెట్టడం లేదు. ప్రకాశ్ రాజ్ ఓటమిని బీజేపీ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే ప్రకాశ్ రాజ్ ఓటమి ప్రకటన రాగానే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. జాతీయ వాద వ్యతిరేక శక్తులను చిత్తుగా ఓడించారంటూ విష్ణుకు అభినందనలు తెలిపారు. మొత్తానికి మా మంటల్లో బీజేపీ చలికాచుకుంటోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: