బీ అలర్ట్ : సలహాదారుల్లో ఆయనొక్కడే బెస్టు!
కొందరు అంటే కాస్త మంచి అభిప్రాయం పుడుతుంది. కొందరు ఉంటే కాస్త మంచి పరిణామం చోటుచేసుకుంటుంది. ఆ కోవలో ఆ తోవలో జర్నలిస్టు సజ్జల రామకృష్ణా రెడ్డి ఉంటారు. అదేవిధంగా ఏపీ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా ఉన్నప్పటికీ, తన స్థాయి దాటి చొరవ తీసుకుని పనులు చేయించేందుకు మాత్రం ఆయన ఇష్టపడరు. అంతా నేనే అన్న నైజం అయితే చూపించరు.ఏం మాట్లాడినా తప్పులు దొర్లనివ్వక మాట్లాడడంతో మంత్రులు కన్నా ఈయనే బెటర్ అని కూడా అనిపించుకున్నారు.
ఆంధ్రావనిలో జగన్ ప్రభుత్వం ఎలా ఉన్నా కొన్ని విషయాల్లో సలహాదారుల తీరు మాత్రం కొంత బాగుంది. కొంత బాలేదు కూడా! కొందరు వీటిని తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుని, అజమాయిషీ చెలాయిస్తున్నారన్న వార్తలూ ఉన్నాయి. కొందరు మాత్రం వీటిని తమ పరిధి మేరకు పరిమితం చేస్తున్నారన్న వాదనా ఉంది. ముఖ్యంగా ఒకప్పటి జర్నలిస్టు అయిన సజ్జల రామకృష్ణా రెడ్డి కొందరు సలహాదారుల కన్నా మంచి స్థాయిలో పనిచేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు నెత్తిపై ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో బాగానే పనిచేస్తున్నారు. అందుకే ఆయనకు క్యాబినెట్ లో తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు కూడా!
కమ్యూనిస్టు బ్యాగ్రౌండ్ ఉన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా పనిచేశారు ఆయన. అంతకుమునుపు పలు పత్రికల్లో న్యూస్ ఎడిటర్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. స్వతహాగా మంచి మనిషి. మృదు స్వభావి. సలహాదారులలో ఆయనొక్కరే మన వింటారు అని ఉద్యోగుల్లో కూడా మంచి సానుభూతి ఉంది. ముఖ్యంగా ఏ సమస్య అయినా సానుకూలంగా అర్థం చేసుకుంటారన్న పేరు కూడా ఉంది. కొన్ని విషయాల్లో కాస్త కఠినంగా ఉన్నా, పరుష పదజాలంతో ఆయన మాట్లాడిన సందర్భాలే అరుదు. అదేవిధంగా మీడియా ఎదుట మాట్లాడినా, బయట మాట్లాడినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి సజ్జల. మిగతా సలహాదారుల తీరెలా ఉన్నా పదవి, పరపతి వీటిని తన అవసరాలకు అనుగుణంగా వినియోగించుకో వడం ఆయనకు తెలియని పని అని కూడా సన్నిహితులు అంటుంటారు. అధికార దుర్వినియోగం అన్న పదానికే ఆయన దగ్గర చోటు ఉండదని, ముఖ్యంగా తన వద్దకు ఎవ్వరు కలిసినా ఎంతో మర్యాదతో మాట్లాడి పంపే గుణం ఉందని, జర్నలిజంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా అదే గుణం పాటింపులో ఉందని అంటారు. ముఖ్యంగా జగన్ తీసుకునే నిర్ణయాల్లో అత్యధికంగా సజ్జలకు చెప్పే చేస్తారన్నది వాస్తవం.