ఆ తమ్ముళ్ళు జనసేనలోకి జంప్?
అయితే జనసేనతో పొత్తు విషయం తెరపైకి రావడంతో కొందరు తెలుగు తమ్ముళ్ళు అలెర్ట్ అయ్యారు. ఎందుకంటే పొత్తు ఉంటే కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలోని తెలుగు తమ్ముళ్ళు ఎందుకంటే ఈ జిల్లాల్లో అత్యధిక సీట్లు ఉన్నాయి...పైగా గత ఎన్నికల్లో ఈ జిల్లాలోనే జనసేనకు ఓట్లు ఎక్కువ పడ్డాయి. జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 19 నియోజకవర్గాల్లో జనసేనకు ఓట్లు బాగానే వచ్చాయి....కానీ జనసేన గెలిచింది ఒక రాజోలు మాత్రమే.
అంటే పొత్తు ఉంటే ఖచ్చితంగా రాజోలు సీటు జనసేనకు ఇవ్వాల్సిందే. దీంతో ఇక్కడ ఉన్న టిడిపి మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు త్యాగం చేయాలి. అయితే సీటు త్యాగం చేయడం కంటే గొల్లపల్లి జనసేనలోకి వెళితే సీటు దక్కే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన తరుపున గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీలోకి జంప్ కొట్టారు. దీంతో ఇక్కడ జనసేనకు బలమైన నాయకుడు కావాలి. గొల్లపల్లి కాస్త బలమైన నాయకుడు...పైగా ఎమ్మెల్యేగా పనిచేశారు.
కాబట్టి గొల్లపల్లి జనసేనలోకి సీటు దక్కించుకోవచ్చు...ఈయనే కాదు...జనసేనకు దక్కుతాయనే సీట్లలో తెలుగు తమ్ముళ్ళు అలెర్ట్ అవుతున్నారు. ఒకవేళ ఆయా నియోజకవర్గాల్లో జనసేనకు బలమైన నాయకులు లేకపోతే...వీరే అటు వెళ్ళి సీట్లు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీటు ఇస్తే పార్టీలోకి వస్తామని పవన్కు చెబుతున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే తూర్పులో పలువురు తమ్ముళ్ళు జనసేనలోకి జంప్ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో రాజకీయం ఎలా మారుతుందో?