జగన్ ఇలాకా : పంట పోతోంది పట్టించుకోడు!
తుఫాను వచ్చే సమయంలో, తీరం దాటిన సమయంలో జగన్ చాలా ఆందోళన చెందాడు. తీరం దాటాక నష్టాల వివరాలు అధికారులు సేకరించాలని, ఇందుకు సచివాలయ సిబ్బందిని వాడుకోవాలని సూచించాడు. ఇంతవరకూ బాగానే ఉంది..కానీ ఇప్పుడు సీఎం జగన్ ఆ సంగతే మరిచిపోయారు. మా ఊరు (శ్రీకాకుళం) ప్రజా ప్రతినిధులు కూడా మాకెందుకులే అన్న విధంగా నిద్ర నటిస్తున్నారు. మొత్తం 13 మండలాలకు పైగా తుఫాను ప్రభావంతో అతలాకుతలం అయిపోతే సీఎం కనీసం ఏరియల్ సర్వే కూ రాలేదు. పోనీ తన బృందాన్నీ పంపారా అంటే అదీ లేదు. ఇప్పుడు బాధిత హృదయాలకు అండగా ఉండేది ఎవరు?
పంట పోయిన ప్రతిసారి ఆదుకుంటాం అని చెప్పే పాలకులు అప్పుడూ ఉన్నారు ఇప్పుడూ ఉన్నారు. తీవ్ర తుఫానుల రాకతో కలత చెందిన సీఎం బాధిత రైతులకు ఆర్థిక భరోసా ఇస్తానన్నారు. యాభై వేల హెక్టార్లలో వరి పంట పోయిందని, 14 వేల హెక్టార్ల అరటి తోటలు నాశనం అయ్యాయని ప్రాథమిక నివేదికలు అధికారులు రూపొందించి పంపినా, సీఎం నుంచి కానీ కన్నబాబు దగ్గర నుంచి కానీ ఎటువంటి స్పష్టమయిన ప్రకటన రాకపోవడంతో మా ప్రాంతం అంటే మా శ్రీకాకుళం (తుఫాను పీడిత ప్రాంతం అని రాయాలి) రైతాంగం కన్నీటిపర్యంతం అవుతున్నారు.
గులాబ్ తుఫాను వచ్చి, పంటలను నష్టపరిచి దాదాపు నెల రోజులు కావొస్తుంది. ఇంతవరకూ పంట నష్టాల అంచనాలే లేవు. కేంద్ర బృందం పర్యటన కూడా లేదు. అసలు ఇంతవరకూ రైతుకు సాయం అందించే విషయమై అధికారిక ప్రకటన కూడా లేనే లేదు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో కంటి తుడుపు గా స్థానిక నాయకుల పర్యటన అయితే అయింది కానీ, ఇప్పటిదాకా పంట పోయిన వారికి అండగా నిలిచిన దాఖలాలే లేవు. తుఫాను కారణంగా వరి, మొక్కజొన్న పంటలకు, అరటి, కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం వచ్చినా, వాటి అంచనాలు సంబంధిత లెక్కలు ఇప్పటిదాకా వెల్లడి చేయలేదు. తొలుత సీఎం ఆదేశాల మేరకు ఆర్బీకే స్టాఫ్ కాస్త హడావుడి చేసినా అదంతా మూడ్నాళ్ల ముచ్చటే అయింది.