రాంగ్ టైమ్ లో షర్మిల పాదయాత్ర..
ప్రస్తుతం రాజకీయమంతా హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతోంది. ఈనెలాఖరు వరకు హుజూరాబాద్ ఉప ఎన్నికల సందడితోనే మీడియా, సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ దశలో షర్మిల యాత్రలకు కవరేజ్ ఇచ్చేది ఎవరు..? కేవలం సోషల్ మీడియాని నమ్ముకుని షర్మిల యాత్రలు చేస్తే ఏం లాభం..? హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత షర్మిల యాత్ర మొదలు పెడితే బాగుండేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.
గతంలో లాగా కేసీఆర్ ఈ దఫా ముందస్తుకి వెళ్లే అవకాశం లేదు. కేసీఆర్ ముందస్తుకి వెళ్లను అని కరాఖండిగా చెప్పేశారు. అయితే రేవంత్ రెడ్డి వంటి ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం కేసీఆర్ ముందస్తుకి వెళ్తారని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు పెట్టుకోవాల్సిన పాదయాత్రను షర్మిల ఇంత ముందుగా మొదలు పెట్టడం ఎంతవరకు లాభసాటి అనేది తేల్చుకోవాల్సి ఉంది.
పాదయాత్ర వల్ల ఉపయోగాలు ఏంటనేది.. ఆల్రడీ వైఎస్ఆర్ నిరూపించారు, జగన్ దాన్ని బలపరిచారు. ఇప్పుడు అదే కుటుంబాన్నుంచి వస్తున్న షర్మిల కూడా పాదయాత్రతోనే రాజకీయాలు మొదలు పెడతానంటున్నారు. మరి ఆ సెంటిమెంట్ అనుకూలిస్తే యాత్రలతో షర్మిలకు కాస్తో కూస్తో లాభం ఉంటుంది. లేకపోతే నాన్ లోకల్ పార్టీ అంటూ షర్మిలను అందరూ పక్కనపెట్టేస్తారు.