ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య ఎలాంటి వార్ నడుస్తుందో అంతా చూస్తూనే ఉన్నారు. టిడిపి నేత పట్టాభి ఏమో జగన్ని తిట్టడం...దాన్ని తట్టుకోలేక వైసీపీ శ్రేణులు ఏమో...టిడిపి కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై దాడులు చేయడం, దాడులకు నిరసనగా టిడిపి రాష్ర్ట బంద్కు పిలుపునివ్వడం, బంద్ సక్సెస్ కాకుండా పోలీసులు చూసుకోవడం, మమ్మలని తిట్టారు కాబట్టి, మా వాళ్ళు కాస్త బీపీ పెంచుకుని దాడులు చేశారనే విధంగా సిఎం జగన్తో సహ వైసీపీ నేతలు మాట్లాడటం, అసలు వైసీపీ నేతలు ఎప్పుడూ బూతులు మాట్లాడనట్లు జగన్ చెప్పడం, ఇంకా దాడులు చేస్తామనే విధంగా కొడాలి, అనిల్ లాంటి వారు మాట్లాడటంపై టిడిపి నేతలు ఫైర్ అవ్వడం, తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని మాట్లాడడం.
ఇదే వైసీపీ-టిడిపి నేతల మధ్య జరుగుతున్న రచ్చ. అయితే ఇంతటి రచ్చలో కూడా కొందరు నేతలు సైలెంట్గానే ఉన్నారు. ముఖ్యంగా టిడిపి ఎంపీలు....అసలు టిడిపి ఆఫీసులపై ఆ రకంగా దాడులు జరిగినా, పట్టాభి ఇంటిపై దాడి చేసినా సరే కొందరు టిడిపి నేతలు బయటకొచ్చి ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. పవన్తో సహ ఇతర పార్టీ నేతలు ఖండించినా సరే, సొంత పార్టీ నేతలు మాత్రం బయటకు రాకుండా ఉండిపోయారు.
అందులో ముఖ్యంగా టిడిపికి ఉన్న ఎంపీలు. టిడిపికి ఉన్నది ముగ్గురు ఎంపీలు.
ఇందులో శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు...వైసీపీపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. రోడ్లపైకి వచ్చి బంద్ చేయడానికి కూడా ప్రయత్నించారు. కానీ పోలీసులు మొదట్లోనే అడ్డుకున్నారు. కానీ విజయవాడ ఎంపీ కేశినేని నాని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్లు మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా ఖండిస్తున్నట్లు కూడా చెప్పలేదు. ఇతర పార్టీలు సైతం ఖండించిన...ఈ ఇద్దరు నేతలు మాత్రం నోరు మెదపలేదు. ఇప్పటికే వీరు టిడిపిని వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ వార్తలని నిజం చేస్తారేమో చూడాలి.