మరో ఆర్ఆర్ఆర్ పట్టాభి ?
ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిపై ఉచ్చు బిగుస్తోంది. ఆయనను అత్యంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు అరెస్టు చేయడం సంచలనాత్మకం అయింది. అరెస్టు నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర కార్యకర్తలకూ,పోలీసులకూ మధ్య తోపులాట జరిగింది. ఇప్పుడీ దృశ్యాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గతంలో ఎంపీ రఘురామ కృష్ణం రాజు, అచ్చెన్నా యుడు అరెస్టులు కూడా ఇలానే జరిగాయి అని టీడీపీ నాయకులు వాపోతున్నారు. పోలీసులు తలుపులు పగులగొట్టి మరీ తమ ఇంట్లోకి వచ్చారు అని పట్టాభి భార్య చెబుతున్నారు. తన భర్తకు ప్రాణ హాని ఉందని కూడా ఆమె ఆందోళన చెందుతున్నారు.
తెలుగుదేశం నేత పట్టాభి ని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విజయవాడ గవర్నర్ పేట పోలీసు స్టేషన్ కు తరలించనున్నా రు. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయో అన్న ఉత్కంఠ ఒకటి రేగుతోంది. ముఖ్యంగా రెబల్ ఎంపీ ఆర్ఆర్ఆర్ విషయమై వ్యవహరించిన విధంగానే ఈయనపై కూడా అదే తరహాలో పోలీసులు థర్డ్ డిగ్రీ అప్లై చేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. దీంతో ఆయన ఒక వీడియో విడుదల చేసి ప్రస్తుతం తనకు ఎటువంటి గాయాలు లేవని, రేపు తన ఒంటి పై గాయాలు ఉంటే అందుకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంటూ వీడియో విడుదల చేశారు. మరోవైపు పట్టాభి అరెస్టుతో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన అరెస్టు నేపథ్యంలో మీడియానూ, టీడీపీ కార్యకర్తలనూ అక్కడి నుంచి పంపేసిన పోలీసులు తరువాత అప్రమత్తమై నగర వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. రేపు ఉదయం ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది.