మళ్లీ వెడేక్కిన భారత్, చైనా బోర్డర్.. కవ్విస్తున్న డ్రాగన్..!?
ఇండియాతో మానసిక యుద్ధంలో ఓడించాలని భావిస్తున్న చైనా.. సరిహద్దుల్లో బలగాలు మోహరిస్తూ భారత్ను భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. వాస్తవాధీన రేఖ అయిన ఎల్ఏసీ వద్ద ప్రస్తుతం 100కు పైగా అత్యాధునిక రాకెట్ లాంఛర్లను మోహరించింది. అయితే ఇటీవలే ఇండియా, చైనా మధ్య మరోసారి సరిహద్దు చర్చలు జరిగాయి. సరిహద్దు వివాదంపై ఇటీవల జరిగిన 13వ విడత సైనిక కమాండర్ల స్థాయి చర్చలు కాస్తా విఫలం అయ్యాయి. దీని ఫలితంగా ఇప్పుడు చైనా ఇండియాను భయపెట్టాలని చూస్తోంది. పైగా.. అబ్బే.. మా జవాన్లు అతిశీతల వాతావరణానికి అలవాటు పడేలా చేయడానికేనంటూ ఈ ఆయుధ మోహరింపులు అంటూ బొంకుతోంది.
చైనా వాస్తవాధీన రేఖ వెంట 100కు పైగా అత్యాధునిక దీర్ఘశ్రేణి రాకెట్ లాంఛర్లను తరలించినట్లు ఆ దేశ సైనిక వర్గాలు చెప్పాయంటూ హాంకాంగ్ నుంచి వెలువడే ఓ పత్రిక రాసింది. భారత్ వద్ద ఉన్న ఎం-777 హోవిట్జర్ల కంటే ఇవి రెట్టింపు దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయట. చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈ విషయం చెబుతోంది. పీసీఎల్-181 కంటే శక్తిమంతమైన పీసీఎల్-191 హోవిట్జర్లను ఏప్రిల్ నెలలోనే ఎల్ఏసీ వద్దకు చేరవేసిందట చైనా. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వానికి చెందిన సీసీటీవీ అప్పుడే కన్ఫామ్ చేసింది. అయితే ఇదంతా చైనా ఆడుతున్న మైండ్ అని భావిస్తున్నారు విశ్లేషకులు. భారత్ మాత్రం ఎందుకైనా మంచిదని.. చైనాకు దీటుగా తన వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఏ క్షణంలో యుద్ధం మొదలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.