ఆంధ్రా తెలంగాణ నేలలకు సంబంధించి మంచి అనుబంధాలే ఉన్నాయి. ఇప్పటికీ ఇవి అలానే ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఇవి విడదీయలేని బంధాలు. రాజకీయం పేరిట కొన్ని విద్వేష ప్రసంగాలు ఆ రోజు కేసీఆర్ చొప్పించినా తరువాత ఆయన కూడా జాగ్రత్త పడ్డారు అన్నదే వాస్తవం. తెలంగాణలో ఉన్న ఆంధ్రా సెటిలర్లకు ఏ కష్టం రానివ్వనని చెప్పి ఆ మాటే నిలుపుకున్నారు. ఆ విధంగా ఆంధ్రులకు అభిమాన నాయకుడిగా మారిపోయారు కూడా! ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం లేదు. కాంగ్రెస్ ప్రభావం కొద్దిగా బీజేపీ ప్రభావం అతి కొద్దిగా ఉంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ మాత్రం తనదైన పంథాలో దూసుకుపోతున్నారు. వెనుకడుగు వేయక దూసుకుపోతున్నారు.
ఇంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని అగ్రగామిగా ఉంచారు. ఇప్పుడు ఆయనలో ద్వేషం లేదు. ఉమ్మడి రాష్ట్ర పాలకులపై ఉన్న కోపం కూడా మంచిదే. దానిని ఎవ్వరూ కాదనలేరు. కానీ అదే సమయంలో తానేం చేస్తానో చెప్పి అనుకున్న మేరకు అన్నీ సాధించారు. కేంద్రంతో కొన్ని సార్లు కయ్యం కొన్ని సార్లు వియ్యం అన్న ధోరణిలోనే ఉన్నారు.
ఉద్యమాల వేళ కేసీఆర్ ఆంధ్రా పాలకులను తిట్టారు. ఆంధ్రా ప్రజలను కాదు. ఆయనకు సామాన్యుడైన శ్రీకాకుళం వాసి అంటే ఇష్టమే! మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఎదిగిన ప్రతి వ్యక్తి అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆ విషయంలో డైలమాకు తావే లేదు. ఆయన కోపం శ్రీకాకుళం మీదో ఉత్తరాంధ్ర మీదో కాదు. ఆ మాటకు వస్తే రాయలసీమ అన్నా ఆయనకు ప్రేమే. నీళ్ల విషయమై ఆయన పట్టుబడతాడు. ఆ స్థాయిలో పోరు సాగించాల్సింది ఎవరు? ఆంధ్రా పాలకులే కదా కానీ ఆ పని వాళ్లు చేయకుండా రాజకీయాలు మాట్లాడతారు. ఇక్కడే కేసీఆర్ కు కోపం తన్నుకు వస్తుంది. మాట్లాడుకుంటే పోయే వాటికి ఢిల్లీ దాకా
లాగడం ఎందుకు అని కూడా ప్రశ్నిస్తారు. ఏదేమైనా కొన్ని విషయాలలో కేసీఆర్ సమర్థంగా పనిచేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రా పాలకుల కన్నా కొన్ని విషయాల్లో పరిణితి ఉన్న నేత. తప్పిదాలు ఉన్నా కూడా మారుమూల ప్రాంతాలలో కూడా ఆయనకు ఇవాళ అభిమానులు ఉన్నారు అన్నది వాస్తవం.