వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలన్న సంకల్పంతో తాను రైతు భరోసా పథకం కు శ్రీకారం దిద్ది ఏటా ఒక్కో లబ్ధిదారుడికి 13,500 రూపాయలు ఇస్తున్నానని తద్వారా ఈ ఏడాది ఈ అక్టోబర్ కు సంబంధించి 50.37 లక్షల మంది రైతులకు మేలు చేకూరిందని, 2,052 కోట్ల రూపాయలు అర్హుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న మాట.
అంతేకాకుండా సున్నా వడ్డీ పథకం కింద లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న వారికి వడ్డీ మాఫీ వర్తించేలా చర్యలు తీసుకుంది ఏపీ సర్కారు. ఈ పథకం ద్వారా 6.67 లక్షల మందికి 112.7 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సమాయత్తం అయింది ప్రభుత్వం. ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ సాగుకు మేలు చేసేవా? అదేవిధంగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద 1,720 రైతు గ్రూపులకు 25.55 కోట్ల రూపాయలను ఇవాళ్లే జమ చేయనున్నారు.
సన్న, చిన్నకారు రైతులకు అద్దె ప్రాతిపదికన విత్తు నుంచి కోత దశ వరకూ అవసరమైన యంత్ర పరికరాల కొరతను అధిగమించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2,134 కోట్ల వ్యయంతో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా 10750 గ్రామ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్) ఏర్పాటు చేయనున్నామని జగన్ చెబుతున్నారు. వరి ఎక్కువగా సాగయ్యే ఉభయ గోదావరి జిల్లాలలో, కృష్ణ, గుంటూరు జిల్లాలలో మండలానికి ఐదు చొప్పున 1035 కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చెబుతున్నారు. ఇవేకాకుండా రైతులకు మరింత సులభంగా పంట రుణాలు అందించేందుకు వీలుగా 10,778 రైతు భరోసా కేంద్రాల్లో 9160 బ్యాకింగ్ కరస్పాండెంట్ల సేవలు అందుబాటులో ఉంచామని అంటున్నారు. త్వరలో ప్రతి ఆర్బీకేలోనూ ఒక బ్యాకింగ్ కరస్పాండెంట్ ఉండేలా మరో 1618 నియమించున్నామని కూడా చెబుతున్నారు. అయితే తమ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను రైతు పొందాలంటే ఈ క్రాప్ లో నమోదు తప్పని సరి అని స్పష్టం చేస్తున్నారు జగన్. ఇవన్నీ బాగున్నాయి కానీ సాగు ప్రాజెక్టుల నిర్వహణ గాలికొదిలేసి రైతుకు డబ్బులు పంచడంపైనే అనేక విమర్శలు వస్తున్నాయి. ఎక్కడా ఇవాళ కాలువ ఆధారిత రైతుకు పంట దక్కుతుందన్న భరోసానే లేదు. అలాంటప్పుడు రైతు భరోసా అందుకొని ఆయనేం చేస్తాడు ?