ఏపీ డీజీపీ సంచలన కామెంట్స్....!

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ లో గంజాయి వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో గంజాయి పంట పై దృష్టి పెట్టింది. తాజాగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేసారు. గంజాయి రవాణపై రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో  డీజీపీ గౌతం సవాంగ్  సమీక్ష నిర్వహించారు. ఏఓబిలో సాగు అవుతోన్న గంజాయి పై దృష్టి సారించిన పోలీస్ బాస్.. తెలంగాణ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ ను రంగం సిధ్దం చేసినట్టు తెలుస్తుంది.
సిఎం జగన్ ఆదేశాల మేరకు నెలరోజులుగా గంజాయిపై లోతైన అధ్యాయనం చేశాము అని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారు అని అన్నారు ఆయన. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతాము అని వివరించారు. ఆంధ్రా - ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉంది అని పేర్కొన్నారు. ఎన్ఐఏ సహకారం తీసుకుని గంజాయిపై ఉక్కుపాదం మోపుతాము అని తెలిపారు. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో 2 లక్షాల 90 వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాము అని వివరించారు.
గత పదేళ్ల ఎన్నడూ లేనంత గంజాయి గడచిన ఏడాదిలో స్వాధీనం చేసుకున్నాము అని తెలిపారు. నర్సాపూర్ లో దొరికిన 3 వేల కేజీల హెరాయిన్ వ్యవహరంతో  ఏపీ కి సంబంధం లేదు అని స్పష్టం చేసారు.  ఏపీ గంజాయి అక్రమ రవాణా కేంద్రమని 2016లోనే ఇతర రాష్ట్రాలు అన్నాయి అని ఆయన తెలిపారు. ముంధ్రా పోర్ట్ లో దొరికిన హెరాయిన్ కి రాష్ట్రంతో సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థపై రాజకీయంగా విమర్శలు వద్దు అని డీజీపీ విజ్ఞప్తి చేసారు. గంజాయి విషయంలో ఎలాంటి వ్యక్తులు ఉన్నా సరే వదిలే ప్రసక్తే లేదని డీజీపీ స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: