మళ్లీ ముంచుకొస్తున్న కరోనా.. మూడోవేవ్ రచ్చరచ్చేనట..?

Chakravarthi Kalyan
కరోనా గురించి జనం దాదాపు మరిచిపోయినట్టే కనిపిస్తున్నారు. దాదాపు జనం అంతా కరోనా టీకా కనీసం ఒక్క డోసైనా వేసుకున్నారు. దేశం మొత్తం మీద 15 వేల కేసులే నమోదవుతున్నాయి. దీంతో జనం లైట్‌ గా తీసుకుంటున్నారు. పెద్దగా మాస్కులు కూడా పెట్టుకోవట్లేదు.. శానిటైజర్‌ను పూసుకోవట్లేదు.. అప్పుడెప్పుడో ఆగస్టులోనే మూడోవేవ్ వస్తుందని నిపుణులు అంచనా వేసినా.. ఆ అంచనాలు నిజం కాలేదు. అయితే కరోనా ముప్పు మాత్రం ఇంకా తొలగిపోలేదట. కరోనా మూడోవేవ్‌ మరింత జోరుగా ముంచుకొస్తోందట.

ఎందుకంటే.. కొన్ని దేశాల్లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్‌, రష్యాలలో కరోనా మూడోవేవ్ ప్రభావం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ మూడోవేవ్‌ మన ఇండియాకు రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనం ఇలాగే నిబంధనల ఉల్లంఘనలు కొనసాగిస్తే..  మూడోదశ విరుచుకుపడటం ఖాయం అంటున్నారు నిపుణులు.

రష్యా, బ్రిటన్‌లలో తాజాగా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. మన పొరుగున ఉన్న చైనాలోనూ మళ్లీ వైరస్‌ కలకలం రేపుతోంది. అయితే ప్రస్తుతం మన దేశంలో మూడో దశ లక్షణాలు కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. జనంలో ఎక్కడా కొవిడ్‌ ఉందనే భావన కనిపించట్లేదు. అయితే ఈ ఉదాసీనత దేశాన్ని మరోసారి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేసే ప్రమాదముందంటున్నారు నిపుణులు.

ప్రస్తుతం దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. చాలా చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. పండుగలు, శుభకార్యాలు ఆగడం లేదు. అన్ని ఇతర కార్యకలాపాలు ఎప్పటిలాగానే నడుస్తున్నాయి. అసలు జనంలో 80 శాతం మాస్కులు ధరించట్లేదని సర్కారు అంచనా. సురక్షిత దూరం అనేది ఎవరూ పాటించట్లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మూడో ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. అందుకే ప్రభుత్వాలు మాత్రం మూడోవేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. కేంద్రం అత్యవసర కొవిడ్‌ నిధులు రాష్ట్రాలకు విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: