హుజురాబాద్: వీవీ ప్యాట్ల తరలింపుపై పొలిటికల్ హీట్!
ఇదిలావుంటే, కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉప ఎన్నిక వీవీ ప్యాట్ తరలింపు కలకలం సృష్టించింది. ఒక వాహనంలో నుంచి మరో వాహనంలోకి వీవీ ప్యాట్ తరలిస్తున్న వీడియో రాత్రి వైరల్గా మారింది. రోడ్డుపై వీవీ ప్యాట్ను తరలిస్తున్న వ్యక్తిని బీజేపీ నేతలు నిలదీశారు. అక్కడికి కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ చేరుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో వీవీ ప్యాట్ తరలింపుపై అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దన్నారు. ఉప ఎన్నికకు ముందు పని చేయని వీవీ ప్యాట్ ను అధికారిక వాహనం నుంచి మరొక అధికారిక వాహనంలో తరలించామని రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.. ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాల రిసెప్షన్ సెంటర్ రోడ్డు ఎదురుగా ఒక వాహనం నుండి మరొక అధికార వాహనంలో గోడౌన్కు తీసుకువెళ్తున్నామని ప్రకటించారు. ఆ దృశ్యాలను అనుమానంతో ఒకరు వీడియో తీసి వైరల్ చేశారని, అది నిజం కాదని అన్నారు.
అయితే వీవీ ప్యాట్ తరలింపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఏంలు మార్చేందుకు కుట్ర చేసినట్లు సందేహాలు వస్తున్నాయన్నారు. వీవీ ప్యాట్ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ఓటుకు రూ. 6 వేలు పంచి ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేశారని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్.. ప్రజా విశ్వాసం కోల్పోయారని మండిపడ్డారు. హుజూరాబాద్ బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసి కేసీఆర్ నీచమైన అకృత్యాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఓడిపోతామని తెలిసి చివరకు ఈవీఎంలను కూడా ట్యాంపరింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ను బీజేపీ నేతలు కలిశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, డీకే అరుణ, పలువురు బీజేపీ నేతలు సీఈవోను కలిసి ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా వినతి పత్రం అందించారు. వీవీ ప్యాట్ల అంశంపై ఎన్నికల అధికారి ఎలా స్పందిస్తారో? ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.