ముంచుకొస్తున్న మరో వైరస్.. ఆ నగరంలో కలకలం..?
ఉత్తర ప్రదేశ్లో జికా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి కాన్పూర్లో కొత్తగా 30 జికా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. అవి కూడా ఒక్క దీపావళి రోజే ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో ఉత్తర ప్రదేశ్లో నమోదైన మొత్తం జికా వైరస్ కేసుల సంఖ్య 70 వరకూ చేరింది. ఇక ఉత్తర ప్రదేశ్లో మొదటి జికా వైరస్ కేసును అక్టోబర్ 24న కాన్పూర్లోనే గుర్తించారు. అప్పటి నుంచి ఈ జికా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.
ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ జికా వైరస్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇక బుధవారం ఒక్కరోజే భారీగా కేసులు నమోదయ్యాయి.. ఆ రోజు 25 జికా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఇక గురువారం కూడా మరో 30 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇలా ఇప్పుడు యూపీలో మొత్తం జికా వైరస్ కేసుల సంఖ్య 70కు చేరింది. ఈ సంఖ్య ఇలాగే పెరిగితే మరిన్ని ప్రాంతాలకు వైరస్ వ్యాపించవచ్చన్న ఆందోళన కనిపిస్తోంది. అందుకే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వ్యాప్తి నివారణ చర్యలు చేపడుతోంది.
రోగులను గుర్తించేందుకు ప్రత్యేక ఆరోగ్య బృందాలతో విస్తృతంగా సర్వే నిర్వహిస్తోంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ జికా వైరస్ కేసులు డెంగీ కంటే ఎక్కువ ప్రమాదకరమైందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూ హెచ్ ఓ హెచ్చరించింది కూడా.